జైలులో వంశీ బ్యారక్‌కు పరదాలు

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జైలులో ప్రత్యేక వసతులు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. కానీ వంశీ కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం చేసినట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - February 18, 2025 / 03:45 PM IST

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జైలులో ప్రత్యేక వసతులు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. కానీ వంశీ కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం చేసినట్టు తెలుస్తోంది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో ఫిర్యాదుదారుడిని కిడ్నాప్‌ చేశాడని వంశీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదే కేసులో విజయవాడలోని జైలుకు వంశీని పోలీసులు తరలించారు. ఈ జైలులో వంశీకి ఒకటో నెంబర్‌ బ్యారక్‌ను అధికారులు కేటాయించారు. అయితే చుట్టుపక్క బ్యారక్‌లలో ఉన్న ఖైదీలకు వంశీ కనపించకుండా వంశీ బ్యారక్‌కు అధికారులు పరదాలు కట్టినట్టు సమాచారం.

ఇక వంశీ ఉన్న బ్యారక్‌ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. వంశీ బ్యారక్‌ ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం అక్కడి పరిస్థితిని పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముదునూరి సత్యవర్ధన్‌ను న్యాయాధికారి ముందు సోమవారం ప్రవేశపెట్టడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. వంశీ ప్రణాళికలతో ఆయన అనుచరులు తనను బెదిరించి కిడ్నాప్ చేశారని, టీడీపీ కార్యాలయంపై జరిగిన కేసులో తనకు సంబంధం లేదని చెప్పించారని సీఆర్పీసీ 161 ప్రకారం సత్యవర్ధన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలాన్ని న్యాయాదికారి ముందు చెప్పాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించి పోలీసులు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్‌కు లేఖ రాశారు. సత్యవర్ధన్ నుంచి 164 వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేందుకు కోర్టును కేటాయించాలని పేర్కొన్నారు. దీనిపై సీఎంఎం కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుని కోర్టును కేటాయించే అవకా శాలుఉన్నాయి. ఇదిలా ఉంటే జైలులో ఉన్న వంశీని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ కలవబోతున్నారు. విజయవాడలోని జిల్లా కారాగారానికి జగన్‌ రానున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ఆయన పరామర్శిస్తారని సమాచారం. ప్రస్తుతం జగన్ బెంగళూరులో ఉన్నారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా వంశీని కలిసేందుకే విజయవాడకు వస్తున్నారు జగన్‌.