TN BSP president murder : తమిళనాడు BSP అధ్యక్షుడి దారుణ హత్య.. మండిపడ్డ మాయావతి

తమిళనాడు బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్​పీ) అధ్యక్షుడు కె ఆర్మ్​స్ట్రాంగ్​‌ దారుణ హత్యకు గురయ్యారు. చెన్నైలోని పెరంబూర్‌​లోని సదయప్పన్​ స్ట్రీట్​లోని తన నివాసంలో ఉండగా ఆరుగురు దుండగులు బైకులపై వచ్చి ఆయనను నరికి చంపారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 July 2024, 10:19 AM IST

 

 

 

తమిళనాడు బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్​పీ) అధ్యక్షుడు కె ఆర్మ్​స్ట్రాంగ్​‌ దారుణ హత్యకు గురయ్యారు. చెన్నైలోని పెరంబూర్‌​లోని సదయప్పన్​ స్ట్రీట్​లోని తన నివాసంలో ఉండగా ఆరుగురు దుండగులు బైకులపై వచ్చి ఆయనను నరికి చంపారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్మ్​స్ట్రాంగ్‌​ను థౌజండ్​లైట్స్​అపోలో ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మార్గమధ్యలో మృతిచెందారు. అయితే ఆర్మ్​స్ట్రాంగ్​తో పాటు ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిపై కూడా దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సెంబియం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే ఇది కక్షపూరితంగా చేసిన హత్య కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

గతేడాది జరిగిన గ్యాంగ్‌స్టర్ ఆర్కాట్ సురేశ్‌ హత్యకు, దీనికి సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్య విషయం తెలిసిన తర్వాత అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్మ్ స్ట్రాంగ్ మృతదేహాన్ని చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు కే ఆర్మ్ స్ట్రాంగ్ హత్యకు గురికావడంపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విచారకరమని, హత్యను ఖండించారు. మరో వైపు ఈ ఘటనను మాజీ సీఎం పళనిస్వామి తీవ్రంగా ఖండించారు. ఈ హత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. స్టాలిన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మండిపడ్డారు.

Published : 
  • 6 July 2024, 10:19 AM IST