Chandrababu Naidu: చంద్రబాబుకు జుడీషియల్ రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలించాలని ఆదేశం

చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. కోర్టు ఆదేశాల ప్రకారం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.

Post Published By: narender Thiru
Updated : 10 September 2023, 7:03 PM IST

Chandrababu Naidu: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైంది. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. కోర్టు ఆదేశాల ప్రకారం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.

ఈ మేరకు పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ చంద్రబాబును రాజమండ్రి తరలించనున్నారు. అంతకుముందు.. అంటే ఈ రాత్రికి సిట్ ఆఫీసులోనే చంద్రబాబును ఉంచనున్నారు. సోమవారం ఉదయం రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం ఉంది. చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఇప్పుడప్పుడే బెయిల్ కోసం హౌజ్ మోషన్ పిటిషన్ వేసేందుకు అవకాశం లేదని తెలుస్తోంది. కోర్టు తీర్పు అందడానికి కాస్త సమయం పట్టొచ్చు. కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాతే, దీనిపై పైకోర్టులో అప్పీల్ చేసే వీలుంది. సోమవారం కోర్టు తీర్పు అందితే.. వెంటనే హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు న్యాయవాదులు భావిస్తున్నారు.

విజయవాడ నుంచి రాజమండ్రికి పోలీసులు రూట్ క్లియర్ చేస్తున్నారు. రాజమండ్రి జైలు దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 22 వరకు చంద్రబాబు జుడీషియల్ రిమాండ్‌లో ఉండనున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు కావడం ఇదే మొదటిసారి.

Published : 
  • 10 September 2023, 7:03 PM IST