సినీ ప్రపంచం ఒక మాయాజాలం. తెరపై కనిపించే తారల మేకప్, వారి గ్లామర్, వారి నటనా వైదుష్యం వెనుక ఎన్నో ఆసక్తికరమైన కోణాలు దాగి ఉంటాయి. మన దేశంలో స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా వెలుగుందుతూ, కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్న పలువురు సెలబ్రిటీల గురించి ఒక నిజం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అదేమిటంటే.. మనం ప్రతిరోజూ ఆరాధించే అనేకమంది నటీనటులు అసలు భారతీయ పౌరులే కారు.విదేశీ పాస్పోర్ట్లతో భారతదేశంలో నివసిస్తూ, ఇక్కడ వర్క్ వీసాలు మరియు లీగల్ పర్మిషన్లతో సినిమాలు చేస్తూ తమ కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. భారతదేశంలో అత్యున్నత స్థాయి స్టార్డమ్ను అనుభవిస్తున్నప్పటికీ, భారత్లో జరిగే ప్రజాస్వామ్య క్రతువైన ఎన్నికల్లో ఓటు వేసే హక్కు మాత్రం వీరికి లేదు.
మన దేశ పౌరసత్వ చట్టాలు చాలా స్పష్టంగా, కఠినంగా ఉంటాయి. ప్రపంచంలోని కొన్ని దేశాలు తమ పౌరులకు 'ద్వంద్వ పౌరసత్వం' కలిగి ఉండే వెసులుబాటును కల్పిస్తాయి. అంటే ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు వేర్వేరు దేశాల పౌరసత్వాన్ని చట్టబద్ధంగా ఉంచుకోవచ్చు. కానీ, భారత రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వాన్ని ఏమాత్రం అనుమతించదు.ఒక భారతీయ పౌరుడు వేరే ఏదైనా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించిన వెంటనే, అతని భారతీయ పౌరసత్వం ఆటోమేటిక్గా రద్దవుతుంది. విదేశీ పాస్పోర్ట్ కలిగి ఉన్న భారతీయ మూలాలున్న వ్యక్తులు లేదా విదేశీ పౌరులు భారత్లో శాశ్వతంగా నివసించడానికి, వ్యాపారాలు చేయడానికి, ఉద్యోగాలు చేయడానికి OCI కార్డును ఉపయోగిస్తారు. OCI కార్డ్ ఉన్నప్పటికీ, సదరు వ్యక్తులకు భారత రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు లభించదు. అలాగే వారు భారతీయ పాస్పోర్ట్ను పొందలేరు.
ఈతరం బాలీవుడ్ నటీమణుల్లో అత్యంత ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందిన అలియా భట్ ముంబైలోనే పుట్టి పెరిగింది. అయినప్పటికీ ఆమె భారతీయ పౌరురాలు కాదు. ఆమె తల్లి సోనీ రజ్దాన్ బ్రిటన్లో జన్మించిన బ్రిటీష్ పౌరురాలు కావడం వల్ల వారసత్వంగా అలియాకు బ్రిటీష్ పౌరసత్వం లభించింది. మన దేశంలో ద్వంద్వ పౌరసత్వం లేకపోవడం వల్ల ఆమె వద్ద బ్రిటీష్ పాస్పోర్ట్ మాత్రమే ఉంది. అందువల్ల ఆమెకు భారత ఎన్నికల్లో ఓటు హక్కు లేదు. దశాబ్దానికి పైగా భారతీయ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఏలిన కత్రినా కైఫ్ హాంగ్కాంగ్లో జన్మించింది. ఆమె తల్లి బ్రిటీష్ పౌరురాలు కాగా, తండ్రికి కాశ్మీరీ మూలాలు ఉన్నాయి. 17 ఏళ్ల వయస్సులో భారత్కు వచ్చిన కత్రినా, ఇప్పటికీ బ్రిటీష్ పాస్పోర్ట్తోనే వీసా ఆధారంగా ఇక్కడ నివసిస్తూ సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ను వివాహం చేసుకున్నప్పటికీ ఆమె పౌరసత్వంలో ఎటువంటి మార్పూ రాలేదు.
టాలీవుడ్ ప్రముఖ నటుడు అఖిల్ అక్కినేని అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మించడం వల్ల ఆయనకు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. అయితే, భారతదేశ పౌరసత్వాన్ని స్వీకరించేందుకు గానూ ఆయన స్వచ్ఛందంగా అమెరికా పౌరసత్వాన్ని వదులుకునే ప్రక్రియను ప్రారంభించినట్లు గతంలో స్పష్టం చేశారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన పూర్తిస్థాయి భారతీయ పౌరుడిగా మారనున్నారు.
'దేవదాసు', 'పోకిరి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఇలియానా డి'క్రూజ్ గోవా ప్రాంతానికి చెందినది. గోవా పూర్వకాలంలో పోర్చుగీస్ పాలనలో ఉండటం వల్ల అక్కడి చట్టాల ప్రకారం ఇలియానా పోర్చుగీస్ పౌరసత్వాన్ని పొందింది. దీంతో ఆమె భారత పౌరసత్వం రద్దయి, ప్రస్తుతం పోర్చుగీస్ పాస్పోర్ట్తోనే ప్రయాణాలు సాగిస్తోంది.
తన అద్భుతమైన నృత్య రీతులతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫతేహి కెనడాలోని టోరంటోలో జన్మించింది. ఆమె కుటుంబానికి మొరాకో దేశ మూలాలు ఉన్నప్పటికీ చట్టపరంగా ఆమె కెనడా పౌరురాలు. చట్టబద్ధమైన వీసా నిబంధనలను పాటిస్తూ ఆమె భారత్లో ఉంటూ హిందీ, తెలుగు, మలయాళ చిత్రాల్లో రాణిస్తోంది. బహ్రెయిన్లో జన్మించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తండ్రి శ్రీలంకకు చెందిన వ్యక్తి. ఈ కారణంగా ఆమెకు శ్రీలంక పౌరసత్వం లభించింది. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా గెలుపొందిన తర్వాత మోడలింగ్, సినిమాల కోసం భారత్కు వచ్చిన జాక్వెలిన్, నేటికీ శ్రీలంక పౌరురాలిగానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.కెనడాలో జన్మించి, ఆ తర్వాత అమెరికా పౌరసత్వాన్ని కూడా పొందిన సన్నీ లియోన్, ప్రస్తుతం ముంబైలోనే నివసిస్తున్నప్పటికీ భారతీయ పౌరసత్వం కలిగి లేదు. ఇలా కొంతమంది సెలబ్రిటీలు
సాంకేతికంగా విదేశీ పౌరులైనప్పటికీ, తమ ప్రతిభతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్నారు.