సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్లే ఆఫ్ రేస్… ఏ జట్టుకు ఎంత ఛాన్స్ ఉందో తెలుసా ?

ముంబై ఇండియన్స్ జట్టుపై కేకేఆర్ 4 వికెట్ల తేడాతో సాధించిన ఘన విజయం ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసును అత్యంత సంక్లిష్టంగా మార్చేసింది. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసులో నిలవడమే కాకుండా మిగిలిన 4 జట్ల ప్లేఆఫ్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది.

Post Published By: dialnews
Updated : 22 May 2026, 4:10 PM IST

ముంబై ఇండియన్స్ జట్టుపై కేకేఆర్ 4 వికెట్ల తేడాతో సాధించిన ఘన విజయం ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసును అత్యంత సంక్లిష్టంగా మార్చేసింది. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసులో నిలవడమే కాకుండా మిగిలిన 4 జట్ల ప్లేఆఫ్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకోగా.. మిగిలిన ఏకైక నాలుగో స్థానం రేసులో ఉన్నాయి.ముంబైపై గెలుపుతో కేకేఆర్ 13 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకుని తన ఆశలను సజీవంగా ఉంచుకుంది. కేకేఆర్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధిస్తే 15 పాయింట్లకు చేరుకుంటుంది. అయితే ప్లేఆఫ్స్ చేరాలంటే కేకేఆర్ కేవలం గెలవడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోవాలి. పంజాబ్ కింగ్స్ భారీ రన్ రేట్‌తో గెలవకుండా ఉండాలి.

కేకేఆర్ విజయం వల్ల రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఒత్తిడి ఒక్కసారిగా పెరిగింది. అంతకు ముందు 14 పాయింట్లతోనే సురక్షితంగా ఉండవచ్చని భావించిన రాజస్థాన్ రాయల్స్‌కు ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగే చివరి మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌గా మారింది. ఒకవేళ కేకేఆర్ తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించి 15 పాయింట్లకు చేరితే.. రాజస్థాన్ ప్లేఆఫ్స్ టికెట్ ఖరారు చేసుకోవడానికి ముంబై ఇండియన్స్ జట్టుపై ఖచ్చితంగా గెలిచి 16 పాయింట్లతో ముందంజ వేయాల్సి ఉంటుంది.పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే గరిష్టంగా 15 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉంది. అయితే కేకేఆర్ కూడా 15 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉండటంతో పంజాబ్ కేవలం మ్యాచ్ గెలిస్తే సరిపోదు. ఒకవేళ రాజస్థాన్ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోయి, పంజాబ్, కేకేఆర్ రెండూ తమ మ్యాచ్‌లలో గెలిచి 15 పాయింట్లతో టై అయితే.. అప్పుడు నిర్ణయం పూర్తిగా నెట్ రన్ రేట్‌పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి పంజాబ్ భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కేకేఆర్ గెలుపు వల్ల సీఎస్కే ప్లేఆఫ్స్ దారులు అత్యంత కష్టతరంగా మారాయి. సీఎస్కే గరిష్టంగా 14 పాయింట్లను మాత్రమే సాధించగలదు. చెన్నై ప్లేఆఫ్స్ చేరాలంటే ఇప్పుడు అద్భుతాలు జరగాలి. కేకేఆర్ తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోవాలి, పంజాబ్ కింగ్స్ కూడా తమ మ్యాచ్‌లో ఓడిపోవాలి. రాజస్థాన్ రాయల్స్ కూడా తన చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో పరాజయం పాలుకావాలి. అప్పుడే 14 పాయింట్ల వద్ద నెట్ రన్ రేట్ ఆధారంగా సీఎస్కేకు అవకాశం ఉంటుంది.ఢిల్లీ క్యాపిటల్స్‌కు కేకేఆర్‌తో జరగబోయే చివరి లీగ్ మ్యాచ్ ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ లాంటిది. ముంబైపై కేకేఆర్ గెలవడంతో, ఢిల్లీ-కోల్‌కతా మధ్య జరిగే తదుపరి మ్యాచ్ 'డైరెక్ట్ నాకౌట్'గా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రేసులో ముందుకు సాగుతుంది, ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నేరుగా నిష్క్రమిస్తుంది. ఒకవేళ రాజస్థాన్ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోయి 14 పాయింట్ల వద్దే నిలిచిపోతే.. సీఎస్కే, కేకేఆర్ లేదా ఢిల్లీలలో ఏవైనా జట్లు 14 లేదా 15 పాయింట్లతో టై అయితే, నాలుగో ప్లేఆఫ్ బెర్త్ విజేతను కేవలం 'నెట్ రన్ రేట్' మాత్రమే నిర్ణయిస్తుంది.

Published : 
  • 22 May 2026, 4:10 PM IST