ఆ ఆలయం ఒక అద్భుతం... అంతులేని రహస్యాలు దాగిన పుణ్యక్షేత్రం. శివకేశవులు ఒకే దగ్గర కొలువుదీరిన... దివ్యధామం. మహిమాన్విత శక్తులను ప్రత్యక్షంగా చూపిస్తున్న... కలియుగదైవం. లక్ష్మీసమేతుడై కొలువుదీరిన.. దివ్యమంగళ రూపం. తన మహిమను కళ్లారా చూపిస్తూ... భక్తులను కటాక్షిస్తున్న కొంగుబంగారం... ఆ ఆలయం గురించి వింటుంటే... ఒక్కసారైనా చూడాలని ఉంది కదూ. ఇంతకీ... ఆ ఆలయం ఎక్కడ ఉంది... అక్కడ కనిపిస్తున్న అద్భుత మహిమ ఏంటి...? తెలుసుకుందాం.
మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. వందల ఏళ్ల నాటి ఆలయాలు... అక్కడ కొలువుదీరిన దేవతా మూర్తులు... ఆ ఆలయాల్లో కనిపిస్తున్న వింతలు ఇప్పటికీ మిస్టరీగానే ఉంటాయి. పూరీ జగన్నాథ ఆలయంలోని రహస్య గది, కేరళలోని శ్రీఅనంత పద్మనాభస్వామి అలయంలోని నేలమాళిగలు... ఇలాంటివి ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలే. తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా... ఎదో ఒక ప్రశ్న మిగిలిపోతూనే ఉంటుంది. అలాంటి అద్భుత ఆలయాల్లో ఒకటి... గబ్బూరులోని శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి క్షేత్రం. ఇక్కడ వేంకటేశ్వరుడికి చేసే అభిషేకం ఒక వింతైన అద్భుతం. సలసల మరిగే నీళ్లను క్షణాల్లో చల్లగా చేస్తున్నాడు.. ఆ కలియుగదైవం. స్వామివారి విగ్రహంపై పోసిన వేడివేడి నీళ్లు... పాదాలను తాకే సరికి... చల్లగా అయిపోతాయి. విగ్రహం పైభాగం మాత్రం వేడిగానే ఉంటుంది. మరో వింత ఏంటంటే... అదే వేడి నీళ్లను స్వామివారి పాదాలపై పోస్తే... అవి వేడిగానే ఉంటాయి. ఇదే... గబ్బూరు వెంకటేశ్వరి విగ్రహ మహిమ.
కర్నాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా దేవదుర్గ మండలం గబ్బూరులో ఉంది ఈ ఆలయం. ఇది 12వ శతాబ్దానికి చెందిన దేవాలయంగా స్థానికులు చెప్తున్నారు. ఈ ఆలయంలో శివకేశకువు కొలువుదీరి ఉంటారు. ఇలా ఉండటం చాలా అరుదు. అలాంటి అరుదైన ఆలయాన్ని... గబ్బూరు శ్రీలక్ష్మీవెంకటేశ్వస్వామి ఆలయం ఒకటి. ఇక్కడ... రెండు గర్భాలయాల్లో శివుడు... వెంకటేశ్వరుడు కొలువై ఉంటారు. ఆ ఆలయంలోని శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది. అంటే... శివలింగంపై ప్రత్యేకమైన గీతలు కనిపిస్తాయి. అరుదైన శివలింగాల్లో ఒకటైన ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించి, పూజిస్తే... కోటిరెట్ల పూజాఫలం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ స్వామివార్లకు రోజూ చేసే పూజలు ఒక ఎత్తు అయితే... ఆదివారం రోజు లక్ష్మీవేంకటేశ్వరస్వామికి చేసే అభిషేకమే మహాద్భుతం. పొగలు కక్కే వేడివేడి నీటితో వేంకటేశ్వరస్వామిని అభిషేకిస్తారు. మూలవిరాఠ్ శిరస్సుపై నుంచి వేడి నీళ్లు పోస్తే... క్షణాల్లో పాదాల చెంతకు చేరే సరికి ఆ వేడి నీళ్లు చల్లగా అయిపోతాయి. మూలవిరాఠ్ శిరస్సు భాగం మాత్రం వేడిగానే ఉంటుంది. అదే వేడి నీటిని పాదాలపై అభిషేకిస్తే... ఈ నీరు వేడిగానే ఉంటుంది. ప్రతి ఆదివారం ఇక్కడి వేంకటేశ్వరస్వామికి జరిగే.. ఈ అద్భుతమైన అభిషేకాన్ని చూసేందుకు... పక్క రాష్ట్రాల నుంచే కాకుండా...విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.
గబ్బూరు వేంకటేశ్వరస్వామి ఆలయ విశిష్టత.. చరిత్ర..!
వాస్తవానికి అభిషేక ప్రియుడు శివుడు. వేంకటేశ్వరస్వామి అలంకార ప్రియుడు. కానీ... గబ్బూరు శ్రీలక్ష్మీవెంకటేశ్వస్వామి ఆలయంలో.. వేంకటేశ్వరుడికి జరిగే అభిషేకమే.. అద్భుత ఘట్టం. హరిహరులు ఒకేచోట కొలువుదీరి అభిషేకాలు, అలంకారాలతో తులతూగుతూ... భక్తులను కటాక్షిస్తుండటం ఈ ఆలయంలోని మరో విశిష్టత. ఆలయ చరిత్ర విషయానికి వస్తే... ఈ ఆలయం నిర్మాణం ఎప్పుడు నుంచి ఉందో ఆధారాలు లేవు. అయితే... 12వ శతాబ్దంలో సేవన వంశానికి చెందిన సింహుడు అనే రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్టు స్థలపురానంలో ఉంది. శివాలయం నిర్మించి... లింగాన్ని ప్రతిష్టించేందుకు అన్నీ ఏర్పాటు చేసుకున్నాడట. అయితే... శివకేశవులు కలలో కనిపించారట. శ్రీహరి ఈ ఆలయంలో తనకూ చోటు కల్పించమని శివుడిని అడిగాడట. దీంతో... తన కోసం ఏర్పాటు చేసిన పీఠాన్ని శ్రీహరికి ఇచ్చాడట శివుడు. కలలో కనిపించిన.. ఈ సంఘటనను అగస్త్య ముని తెలుసుకుని... ధ్యానశక్తి ద్వారా దేవతల సమక్షంలో లక్ష్మీవేంకటేశ్వరస్వామిని, బ్రహ్మసూత్ర శివలింగం రూపంలో పరమేశ్వరుడిని ప్రతిష్టించడం జరిగిందని స్థలపురాణం చేప్తోంది. ఇంతటి అద్భుతమైన... ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైన చూసి తరలించాల్సిందే కదూ. ఈ ఆలయంలో పరమేశ్వరుడు, వేంకటేశ్వరస్వామి మాత్రమే కాదు... ఆంజనేయుడు, గరుడ లక్ష్మీనారాయణుడు కూడా దర్శనమిస్తాడు.