కుంభమేళా వేళ్లే దారులన్నీ కిటకిట ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిస్తున్న జనం

ప్రయోగ్ రాజ్ కు పోటెత్తారు. త్రివేణి సంగమం కిక్కిరిసిపోతోంది. కోట్ల మంది భక్తులు...కుంభమేళాకు క్యూకడుతున్నారు. నిత్యం కోట్ల మంది భక్తులు...పవిత్రస్నానాలు ఆచరిస్తున్నారు.

Post Published By: Vencateshg
Updated : 12 February 2025, 1:20 PM IST

ప్రయోగ్ రాజ్ కు పోటెత్తారు. త్రివేణి సంగమం కిక్కిరిసిపోతోంది. కోట్ల మంది భక్తులు...కుంభమేళాకు క్యూకడుతున్నారు. నిత్యం కోట్ల మంది భక్తులు...పవిత్రస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే దారుల్లో...ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఏ దారిలో వెళ్దామన్నా...భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఈ ట్రాఫిక్ జాం ఎన్ని రోజులో కొనసాగుతుందో...యూపీ అధికారులు అంచనా వేయలేకపోతున్నారు.

మహా కుంభమేళాలకు...జనం పోటెత్తారు. దేశంలోని వాహనాలన్నీ...ప్రయాగ్‌రాజ్ కు క్యూకట్టారు. వేలు, లక్షలు కాదు...కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి వైపు అడుగులేస్తున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా ? నేల ఈనిందా ? ఎన్టీఆర్ అన్నట్లు...ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా...ప్రయాగ్‌రాజ్‌లో వాలిపోతున్నారు. 140 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో స్నానమాచరించేందుకు పోటీ పడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ నడుచుకొని వెళ్లి...త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు. రైళ్లు, సొంత వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్, టూరిస్ట్ బస్సులు, విమానాల్లో...ప్రయోగ్ రాజ్ వెళ్తున్నారు. మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో భారీ ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిద్దామని వచ్చిన లక్షల భక్తులు రహదారులపై చిక్కుకున్నారు. ఫలితంగా యూపీ పోలీసు యంత్రాంగం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో రాకపోకలను నిలిపివేసింది. 300 కిలోమీటర్ల మేర వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.

హైదరాబాద్ లో పది నిమిషాలు ట్రాఫిక్ జాం అయితేనే...వేల కొద్దీ వాహనాలు నిలిచిపోతాయి. ప్రయోగ్ రాజ్ లో అయితే..రెండు రోజులు...అంటే 48 గంటల పాటు లక్షల మంది భక్తులు ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయారు. 50 కిలోమీటర్లు వెళ్లేందుకు...దాదాపు 12 గంటల సమయం పడుతోందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. భక్తుల రద్దీని నియంత్రించలేని కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఎనిమిది రైల్వేస్టేషన్ల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు...త్రివేణి సంగమానికి వెళ్తున్నారు. మహాకుంభమేళాలో ఇప్పటి వరకు దాదాపు 44 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. కుంభమేళాలో భక్తులంతా భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. భజనాలు, భక్తి గీతాలు ఆలపిస్తూ..గ్రూపులుగా వెళ్లి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.

ప్రయాగ్‌రాజ్ ప్రవేశం సమీపంలో నవాబగంజ్‌లో 30 కిలోమీటర్లు, గౌహానియాలో 16 కిలోమీటర్లు, వారణాసి మార్గంలో 12 నుంచి 15 కలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విపరీతమైన రద్దీ కారణంగా రైలు ఇంజిన్‌లోకి కూడా ప్రయాణికులు ప్రవేశిస్తున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జాం కారణంగా జనజీవనం స్తంభించిపోతోంది. మధ్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తుల వాహనాల కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌జాం అయింది. గంటగంటకు ట్రాఫిక్‌ రద్దీ పెరగుతుండడంతో భక్తులు ఆహారం, విశ్రాంతి లేక నీరసించిపోతున్నారు.

ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే మార్గాల్లో భారీ ట్రాఫిక్‌జామ్‌ పై మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్...సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాహాకుంభమేళా ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ట్రాఫిక్‌జాం కారణంగా రహదారులపై చిక్కుకున్న లక్షల మంది భక్తులు ఆకలి, దాహంతో ఇబ్బంది పడుతున్నారని...ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సామాన్య భక్తులూ మనుషులే అనీ మానవతా దృక్పథంలో వాళ్లకీ అత్యవసర ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు.

Published : 
  • 12 February 2025, 1:20 PM IST