క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విజ్డెన్ అవార్డుల్లో టీమిండియా ప్లేయర్లు ఆధిపత్యం చాటారు. ఈ ఏడాది తొమ్మిది ప్రధాన అవార్డుల్లో ఏకంగా ఏడు అవార్డులు భారత ఆటగాళ్లకే దక్కాయి. ఐదు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల్లో నాలుగు టీమిండియా ప్లేయర్లే కైవసం చేసుకున్నారు. క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. గతేడాది ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో 754 పరుగులు చేయడంతో పాటు , ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో 269 ,161 పరుగులతో అదరగొట్టాడు. అలాగే రవీంద్ర జడేజా గతేడాది ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో 86 సగటుతో 516 పరుగులు చేశాడు. జడేజా చేసిన శతకంతో మాంచెస్టర్లో భారత్ ఓటమి నుంచి గట్టెక్కింది.
అలాగే గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో హెడింగ్లే టెస్ట్లో రిషబ్ పంత్ రెండు శతకాలు సాధించాడు. మరో మ్యాచ్లో గాయంతోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇదిలా ఉంటే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా అదరగొట్టాడు. ఇంగ్లండ్ పర్యటనలో 23 వికెట్లు తీయగా.. ఓవల్ టెస్ట్లో చివరి రోజు తొలి సెషన్లో 5 వికెట్లు పడగొట్టాడు.మరోవైపు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో నాటింగ్హామ్షైర్కు 15 ఏళ్ల తర్వాత ఛాంపియన్షిప్ దక్కడంలో కీలక పాత్ర పోషించిన హసీబ్ హమీద్ విజ్టెన్ క్రికెటర్ గా ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో అతడు 66 సగటుతో 1258 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన దీప్తి శర్మకు లీడింగ్ వుమెన్స్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డు లభించింది. అటు టీమిండియా విధ్వంకర ఓపెనర్ అభిషేక్ శర్మ లీడింగ్ టీ20 క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో విశేషంగా రాణించిన భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ విజ్డెన్ ట్రోఫీ గెలుచుకున్నాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో డబుల్ సెంచరీ, భారీ సెంచరీ సహా 430 పరుగులు చేసి భారత్ను గెలిపించినందుకు గానూ గిల్ను ఈ అవార్డు వరించింది. ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్కు లీడింగ్ మెన్స్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డు లభించింది.