ఐపీఎల్ తర్వాత వరుసగా వన్డే, టీ20 సిరీస్లతో బిజీగా గడిపిన టీమిండియా వచ్చే నెలలో శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఈ వారంలోనే ప్రకటించే అవకాశముంది. సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు టెస్టు జట్టులోకి తిరిగి రానున్నారు. ఇంగ్లాండ్ తో చివరి వన్డేకు గాయం కారణంగా దూరమైన బుమ్రా లంకతో టెస్ట్ సిరీస్ సమయానికి కోలుకుంటాడని భావిస్తున్నారు. ఇంగ్లాండ్ నుంచి స్వదేశం చేరుకున్న తర్వాత బెంగళూరు సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ కు బుమ్రా వెళ్లనున్నాడు. ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుని ఫిట్ నెస్ సాధించాల్సి ఉంటుంది. ఇంకా మూడు వారాల సమయం ఉండడంతో బుమ్రా కోలుకుంటాడని బీసీసీఐ కాన్ఫిడెంట్ గా ఉంది. బుమ్రా, జడేజాలు తమ చివరి టెస్టు మ్యాచ్ను 2025 నవంబర్లో సౌతాఫ్రికాతో ఆడారు.
లంకతో టెస్ట్ సిరీస్ కు మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ, కుల్దీప్ యాదవ్ పేర్లు కూడా పరిగణలో ఉన్నాయి. గాయంతో ఇంగ్లండ్ సిరీస్ నుంచి వైదొలిగిన వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడడం అనుమాంగానే ఉంది. అయితే గాయం నుంచి కోలుకున్న నితీశ్ కుమార్ రెడ్డి ఈ సిరీస్కు ఎంపికయ్యే అవకాశముంది. గిల్ సారథ్యంలోని టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలకు టెస్టు సిరీస్లను కోల్పోయింది. ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టులో మాత్రం భారీ విజయం సాధించడం ఊరట కలిగించింది.
అయితే సొంతగడ్డపై ఎదురైన పరాభవాలను మరిచిపోయేందుకు లంకతో టెస్టు సిరీస్లో రాణించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ ను గెలవడం తప్పనిసరి. మరోవైపు టెస్టు సిరీస్కు ముందు భారత జట్టు శ్రీలంక-ఏ జట్టుతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలేలోనూ, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్లో ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది.