ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఫైర్ బ్రాండ్గా కనిపించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వ్యవహారం ఇప్పుడు నడిరోడ్డుపైకి వచ్చింది. నిన్నటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు, ఆడియో రికార్డింగులు చూస్తుంటే.. జోగి రమేష్ రాజకీయ జీవితానికి ఇది దాదాపు ముగింపు పలికేలా ఉందనే చర్చ నడుస్తోంది. గుట్టుగా నాలుగు గోడల మధ్య ఉండాల్సిన కుటుంబ విషయాలు.. ఇప్పుడు అందరికీ తెలిసిపోయి ఇదేం ఫ్యామిలీరా బాబు అని చర్చించుకునే వరకు వచ్చింది. సొంత కోడలు పెట్టిన కేసు, ఇప్పుడు కొడుకే తండ్రిపై తిరగబడిన వీడియోలు బయటకు రావడంతో జోగి రమేష్ డిఫెన్స్లో పడిపోయారు. ఈ మొత్తం వివాదం ఏంటి? అసలు ఆ వీడియోలలో ఏముంది? వైసీపీ క్యాడర్ ఎందుకు సైలెంట్గా ఉంది?
గత నెలలో జోగి రమేష్ కోడలు మేఘన.. మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన భార్య శకుంతల, కుమారుడు జోగి రాజీవ్లతో పాటు మొత్తం 11 మందిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో గృహహింస, వరకట్న వేధింపులు, మోసం, మరియు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అయితే నిన్నటి వరకు ఇవి కేవలం ఆరోపణలుగానే ఉన్నాయి. కానీ, నిన్న బయటకు వచ్చిన కొన్ని అంతర్గత చర్చల వీడియోలు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పాయి. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీకి సంబంధించిన వీడియోలు నెట్టింట లీక్ అయి వైరల్ అవుతున్నాయి.
వైరల్ అవుతున్న ఆ వీడియోలలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ తన తండ్రిపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. "నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఫోటో చూసినప్పుడే చెప్పాను. పది మందిని పిలిపించి నాకు బ్రెయిన్ వాష్ చేసి బలవంతంగా పెళ్లి చేశావు. అంతా నువ్వే చేశావు నాన్న" అంటూ రాజీవ్ తన తండ్రి జోగి రమేష్పై సోఫాపై నిలబడి బూతులతో ఊగిపోతూ అరిచాడు. తండ్రి ఎంత సర్ది చెప్పాలని చూసినా కుమారుడు వినలేదు. అంతేకాదు, "నేను సంసారానికి పనికిరాను.. శారీరకంగా అన్ఫిట్" అని తనకున్న వ్యక్తిగత, శారీరక ఇబ్బందులను కూడా భార్య వద్ద ఒప్పుకున్నట్లు ఆ వీడియోల ద్వారా వెల్లడవుతోంది.
అతనికి సమస్య ఉందని తెలిసి కూడా కేవలం రాజకీయం కోసం, అదనపు ఆస్తుల కోసం బలవంతంగా ఈ పెళ్లి చేశారనే నిజాలు ఈ లీక్ల ద్వారా బయటపడ్డాయి. మరొక వైపు జోగి రమేష్ భార్య శకుంతల తన కోడలు మేఘనను అదనపు కట్నం తెమ్మంటూ తీవ్రంగా వేధించినట్లు, హిందూ దేవతల ఫోటోలను తీసేయడం వంటి పనులు చేసినట్లు ఎఫ్ఐఆర్లో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త తనతో కాపురానికి ఫిట్ కాదనే సత్యాన్ని దాచిపెట్టి తనకు అన్యాయం చేశారని కోడలు మేఘన వాపోతుంటే, "నీకు అన్యాయం జరిగితే మాకేంటి నొప్పి" అంటూ జోగి రమేష్ మరియు ఆయన కొడుకు మాట్లాడిన మాటల క్లిప్పింగులు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి.
ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారంటూ నెటిజన్లు జోగి రమేష్ ఫ్యామిలీపై తీవ్రంగా మండిపడుతున్నారు. సాధారణంగా పార్టీ నేతలపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా కౌంటర్లు ఇస్తుంది. కానీ ఈ జోగి రమేష్ ఉదంతంలో మాత్రం వైసీపీ క్యాడర్, లీడర్లు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. దీనికి ప్రధాన కారణం.. ఇది పూర్తిగా ఒక కుటుంబానికి సంబంధించిన నైతిక, వ్యక్తిగత వివాదం కావడం, పైగా పక్కా ఆధారాలతో కూడిన వీడియోలు బయటకు రావడంతో డిఫెన్స్ చేయడానికి ఎలాంటి అవకాశం లేకపోవడం. ఒక ఆడపిల్లపై జరిగిన అన్యాయాన్ని, వేధింపులను సమర్థిస్తే సమాజంలో పార్టీకి మరింత చెడ్డపేరు వస్తుందనే భయంతో వైసీపీ క్యాడర్ ఈ విషయంలో జోగి రమేష్కు కనీస మద్దతు కూడా ఇవ్వడం లేదు.
గత ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత నమోదైన రాజకీయ కేసులు ఒకెత్తయితే.. ఇప్పుడు సొంత కుటుంబం నుండి బయటపడిన ఈ నైతిక సంక్షోభం జోగి రమేష్ రాజకీయ కెరీర్ను కోలుకోలేని దెబ్బ తీసిందనే చెప్పాలి. "చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ" అనే సామెత ఆయన కుటుంబానికి సరిగ్గా సరిపోతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఈ వీడియోలు, ఆడియోల లీకేజీతో ఆయన రాజకీయంగా దాదాపు క్లోజ్ అయినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.