జపాన్లో సెప్టెంబరు 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే భారత పురుషులు, మహిళల జట్లను ప్రకటించింది. గత ఎడిషన్ లో స్వర్ణ పతకం సాధించిన టీమిండియా, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈసారి బరిలోకి దిగనుంది. అయితే టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జట్టులోని ఐదుగురు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది.గాయపడిన వారిలో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముందంజలో ఉన్నాడు.
ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా ఎడమ మోకాలి గాయానికి గురైన బుమ్రా, శ్రీలంక టెస్టు సిరీస్కు కూడా దూరమయ్యాడు. మరో యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా ఇంగ్లాండ్ పర్యటనలో గ్రేడ్-1 హామ్స్ట్రింగ్ గాయానికి గురై బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహాబిలిటేషన్ పొందుతున్నాడు.అటు స్పిన్ విభాగంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎడమ తొడ కండరాల గాయంతో జింబాబ్వే టూర్ నుంచి వైదొలిగి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ నితీష్ కుమార్ రెడ్డి క్వాడ్రిసెప్స్ సమస్యతో బాధపడుతుండటంతో ఇటీవల సిరీస్లకు దూరమయ్యాడు.
ఆసియా క్రీడల్లో బ్యాట్, బాల్తో కీలకం కానున్న వాషింగ్టన్ సుందర్ సైతం కుడి తొడ కండరాల నొప్పితో శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు.ఈ ఐదుగురు స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియాలో కీలకంగా ఉన్నారు. టోర్నీ ప్రారంభానికి దాదాపు ఐదు వారాల సమయం ఉంది. వీరంతా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోలుకుంటున్నారు. మరి టోర్నీ నాటికి ఎవరెవరు ఫిట్నెస్ సాధిస్తారనేది వేచి చూడాలి.