మహిళల ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. నాలుగోసారి ఫైనల్ కు చేరిన టైటిల్ పై ఆశలు పెట్టుకున్న ఢిల్లీకి షాక్ ఇస్తూ స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ ట్రోఫీ ఎగరేసుకుపోయింది. బ్యాటింగ్ స్మృతి, జార్జియా దూకుడైన బ్యాటింగ్ భారీ టార్గెట్ సైతం వన్ సైడ్ గా మారిపోయింది. చివర్లో వరుస వికెట్లు పడినప్పటకీ డిక్లార్క్ , రాధాయాదవ్ మ్యాచ్ ను ఫినిష్ చేశారు. దీంతో ఢిల్లీకి మళ్లీ నిరాశే మిగిలింది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్లు షెఫాలీ వర్మ, లిజెల్లే లీ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 49 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. వీరి పార్టనర్ షిప్ ను తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి బ్రేక్ చేసింది. తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా దూకుడుగా ఆడింది.
ఫామ్ కొనసాగిస్తూ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. చివర్లో చినెల్లీ హెన్రీ విధ్వంసం సృష్టించింది. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ కు దిగిన హెన్రీ.180 పరుగులైనా చేస్తుందా అనుకున్న ఢిల్లీకి హెన్రీ భారీ స్కోర్ అందించింది. లారా వోల్వారడ్ట్ కూడా దూకుడగా ఆడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ముందు ఉంచింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే ఫైనల్ మ్యాచ్లో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. ఆర్సీబీ బౌలర్లలో లారా బెల్ ఆకట్టుకోగా.. మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శ్రేయాంకా పాటిల్ వైఫల్యం కూడా ఢిల్లీ భారీస్కోరుకు కారణమైంది.
204 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రెండో ఓవర్లోనే ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న గ్రేస్ హ్యారిస్ తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. అయితే స్మృతి మంధాన, జార్జియా వోల్ మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేశారు. ఢిల్లీ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. పిచ్ ఫ్లాట్ గా ఉండడం, మంచు ప్రభావం కూడా కలిసి రావడంతో ఆర్సీబీ జోరుకు అడ్డే లేకుండా పోయింది. కీలక మ్యాచ్ లలో ఆకట్టుకునే స్మృతి మరోసారి తన ఫామ్ కొనసాగిస్తూ దుమ్మురేపింది. అటు జార్జియా కూడా విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ స్కోరు ఫస్ట్ గేర్ లో దూసుకెళ్లింది. ఎక్కడా కూడా ఒత్తిడికి లోనుకాకుండా వీరిద్దరూ భారీ షాట్లు కొట్టారు.
ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అర్థ సెంచరీల తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ స్కోర్ పెంచారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 92 బంతుల్లోనే 165 పరుగులు జోడించారు. స్మృ తి 41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 , జార్జియా 54 బంతుల్లో 14 ఫోర్లతో 79 పరుగులకు ఔటయ్యారు. చివర్లో వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో కాస్త ఉత్కంఠ రేగినా రాధా యాదవ్ , డిక్లార్క్ మ్యాచ్ ను ముగించారు. ఆర్సీబీ టైటిల్ గెలవడం ఇది రెండోసారి. 2024లో స్మృతి మంధాన సారథ్యంలోనే బెంగళూరు టైటిల్ సొంతం చేసుకుంది. ఇక డబ్ల్యూపీఎల్ ఆరంభం నుంచీ ప్రతీసారి ఫైనల్ కు చేరుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈ సారి కూడా నిరాశే మిగిలింది. పేలవమైన బౌలింగ్ , మంచు ప్రభావం ఢిల్లీ ఓటమికి కారణమయ్యాయి. గత ఎడిషన్ లో ఢిల్లీ టైటిల్ విజయానికి ముంబై అడ్డుపడితే ఈ సారి ఆర్సీబీ అడ్డంకిగా నిలిచింది.