పుణెలో సంచలనం సృష్టించిన 25 ఏళ్ల కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పోలీసుల విచారణలో సియా, చేతన్ ఇద్దరూ ఈ హత్యతో తమకు సంబంధం లేదంటూ ఒకరిపై ఒకరు నేరం నెట్టుకుంటున్నారు. తనకు సియాతో కేవలం పారిపోయి పెళ్లి చేసుకోవాలని మాత్రమే ఉండేదని, కేతన్ను చంపాలన్నది పూర్తిగా సియా ప్లాన్ అని చేతన్ చెబుతున్నాడు. కానీ, హత్యకు కుట్ర పన్నింది చేతన్ అని, జూన్ 14న కేతన్ను చంపే ప్లాన్ విఫలమైనప్పుడు చేతన్ తన ముందు ఏడ్చాడని సియా పోలీసులకు చెప్పింది.
పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. సియా, చేతన్ గతేడాది అక్టోబర్ నుంచి ప్రేమలో ఉన్నారు. గత ఏడాది కాలంలో వీరిద్దరూ సుమారు 4, 400 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్టు కాల్ రికార్డులు ఉన్నాయి. మరోవైపు, అమెరికాలోని బోస్టన్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి వచ్చిన కేతన్తో సియాకు ఫిబ్రవరి 19న నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరి కుటుంబాలకు ముందు నుంచే పరిచయం ఉంది. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి రెండు కుటుంబాలు భారీగా ఏర్పాట్లు చేసుకున్నాయి.
కానీ, సియాకు కేతన్ను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ముందుగా బాలిలో జరగాల్సిన ప్రీ-వెడ్డింగ్ షూట్ను ఆపడానికి కేతన్ పాస్పోర్ట్ను సియా దొంగిలించింది. ఆ తర్వాత కేతన్ను అడ్డుతొలగించుకునేందుకు మే 31, జూన్ 14 తేదీల్లో రెండు సార్లు చంపడానికి ప్రయత్నించి విఫలమైంది. చివరికి జూన్ 18న సియా, చేతన్ పథకం ప్రకారం లోహగఢ్ కోట పైనుంచి లోయలోకి తోసేసి హత్య చేశారు. జూన్ 23న పోలీసులు ఈ ఇద్దరినీ అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు. వీళ్లు ఇప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నప్పటికీ, నేరంలో ఇద్దరి పాత్రా ఉంది కాబట్టి శిక్ష తప్పదంటున్నారు పోలీసులు.