Mohammad Adil Khan from Uttar Pradesh has won the lottery, said a representative of Emirates Lottery operator Ticherus
ఇతని పేరు మొహమ్మద్ ఆదిల్ ఖాన్. ఉత్తరప్రదేశ్ లో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు. గడిచిన కొన్ని నెలలుగా దుబాయ్ లోని ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్నారు. ఇతని డిసిగ్నేషన్ ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్. ఇటీవల ఈ అరబ్ సంస్థ మెగా ప్రైజ్ మనీ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో యూఏఈ ఫాస్ట్ 5 అనే లాటరీ పేరుతో లక్కీ డ్రా తీశారు. అందులో ఇతనికి లక్ష్మి వరించింది. దీంతో ఆదిల్ ఖాన్ ముఖం హై వోల్టేజ్ లైట్ లాగా వెలిగిపోయింది. ఈ వార్త విన్న ఆయన కుటుంబసభ్యులు ముందు ఇది నిజమేనా కాదా అని ఆరాతీశారు. ఇది అక్షరాలా లక్షలు ఇచ్చే అదృష్టం అని తెలుసుకొని ఆనందంలో మునిగిపోయారు.
ఈ విషయం పై ఎమిరైట్స్ లాటరీ నిర్వహించే టైచెరస్ కంపెనీ మార్కెటింగ్ హెడ్ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. యూఏఈ ఫాస్ట్ 5 పేరిట లాటరీ తీసినట్లు.. అందులో భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ కి చెందిన వ్యక్తి మొదటి విజేతగా నిలిచినట్లు వెల్లడించారు. ఈ లాటరీ ప్రకారం ప్రతి నెలా 25 వేల దిర్హమ్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అంటే మన భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ. 5,59,822 అనమాట. ఇలా ఒక నెలో.. ఒక సంవత్సరమో కాదు పాతికేళ్ల పాటూ నెలకు ఐదున్నర లక్షలు అందిస్తూనే ఉంటుందని ప్రకటించారు. అంత మొత్తాన్ని ఒకేసారి అందించవచ్చు అయితే అతని అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇలా కాలపరిమితి విధించినట్లు వివరించారు. ఈ లాటరీ ప్రారంభించిన అతి స్వల్పకాలంలోనే తొలి విజేతను ప్రకటించి అతనిని మిలినియర్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఇక లక్కీ డ్రాలో గెలిచిన ఖాన్ మాటల్లో ఆనందాన్ని పట్టలేము. ఇలా అనూహ్యంగా అదృష్టం వరించడం పై స్పందిస్తూ.. నాది చాలా సామాన్య కుటుంబం. నా కుటుంబంలో నేనొక్కడినే సంపాదిస్తున్నాను. దీంతో జీవనం చాలా కష్టంగా ఉంది. గతంలో కోవిడ్ కారణంగా మా అన్న చనిపోయారు. అతని కుటుంబాన్ని కూడా నేనే పోషించాల్సి వచ్చింది. మా తల్లిదండ్రలు వృద్ధాప్యంలో ఉన్నారు. పని చేసి సంపాధించే శక్తి వారిలో లేదు. ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో తమ కుటుంబాన్నీ నెట్టుకురావడం చాలా కష్టం తో కూడుకున్నది. ఈ సమయంలో ఇంతటి లాటరీ నాకు వరించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికీ ఈ విషయాన్ని నేను నమ్మలేక పోతున్నానంటూ తెలిపారు.
T.V.SRIKAR