Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

తొలి విడతలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 102 నియోజకవర్గాల్లో నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 20, బుధవారం నుంచి 27 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.

Post Published By: narender Thiru
Updated : 20 March 2024, 2:42 PM IST

Lok Sabha Elections 2024: దేశంలో ఎన్నికల సమరం మొదలైంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం (ఈసీ) ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయగా, ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలైంది. లెజిస్లేటివ్ కౌన్సిల్ జాయింట్‌ సెక్రటరీ దివాకర్‌ సింగ్‌ పేరుతో బుధవారం తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈసీ. తొలి విడతలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.

Game Changer: లీకైన గేమ్ ఛేంజ‌ర్ స్టోరీ.. శంక‌ర్ స్టైల్‌లో వెన్నుపోటు పాలిటిక్స్‌

102 నియోజకవర్గాల్లో నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 20, బుధవారం నుంచి 27 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెల 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 30 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. మొత్తం ఎన్నికలు పూర్తయ్యాక.. ఫలితాలు జూన్‌ 4న విడుదల కానున్నాయి. తొలివిడతలో.. తమిళనాడులోని 39 స్థానాలు, రాజస్థాన్‌లోని 12 స్థానాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8 స్థానాలు, మధ్యప్రదేశ్‌లోని 6 స్థానాలు, మహారాష్ట్రలో 5, ఉత్తరాఖండ్‌లో 5, అసోంలో 5, బిహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, అరుణాచల్‌ప్రదేశ్‌లో రెండు, మణిపుర్‌లో రెండు, మేఘాలయలలో రెండు స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లో ఒక్కొక్క లోక్‌సభ స్థానానికి తొలివిడతలో ఎన్నిక జరగనుంది.

ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు, దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం 44 రోజులపాటు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో పూర్తిగా ఎన్నికల సందడి మొదలైంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. గతంలో ఏప్రిల్‌, మే మొదటి వారంలోపే ఎన్నికలు పూర్తయ్యేవి. మేలోనే ఫలితాలు వెల్లడయ్యేవి. కానీ, ఈసారి మాత్రం జూన్ వరకు ఎన్నికల ప్రక్రియ సాగనుంది. 1951-52లో జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం జరుగుతున్న ఎన్నికలు కూడా ఇవే కావడం కూడా విశేషం.

 

Published : 
  • 20 March 2024, 2:42 PM IST