ఎంఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటరయ్యి ఆరేళ్లు అవుతున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.కేవలం అభిమానుల కోసమే ఐపీఎల్ ఆడుతున్న మిస్టర్ కూల్ రిటైర్మెంట్పై ఇప్పటికే చాలా ప్రశ్నలు వచ్చాయి. గత కొన్నేళ్లుగా ఇదే చివరి సీజన్ అనే మాట వింటూ వస్తున్నాం. కానీ, తనకు ఓపిక ఉన్నంత వరకూ ఫ్యాన్స్ కోసం సీఎస్కేలో ఆడుతూనే ఉంటానని ధోనీ గతంలో కూడా చెప్పాడు.చెన్నై చెపాక్ స్టేడియంలో తాజాగా నిర్వహించిన ఫ్యాన్స్ మీట్లో తమిళ నటుడు శివకార్తికేయన్ - ధోనీ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఇప్పుడు అది టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్గా మారిపోయింది. శివకార్తికేయన్ ధోనీని మీరు ఇంకా చాలా ఏళ్లు ఆడాలి అంటూ కోరగా.. ధోనీ వెంటనే 60 ఏళ్ల వరకు ఆడమంటారా అని చెప్పడంతో స్టేడియం మొత్తం ఫ్యాన్స్ గోల గోల చేశారు.
ప్రస్తుతం ధోనీ వయస్సు 44 సంవత్సరాలు. నాలుగేళ్ల కిందట కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ధోనీ ఆ తర్వాత జడేజా, రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. ఆ ఇద్దరికీ కెప్టెన్సీ అప్పగించినప్పటికీ మధ్యలో ధోనీనే సారథ్యం వహించాల్సి వచ్చింది. ఐపీఎల్ 2023లో టైటిల్ గెలిచిన తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఊహాగానాలు వినిపించాయి. కానీ, ఫ్యాన్స్ కోసం మళ్లీ బ్యాట్ పడుతూనే ఉన్నాడు.ఐపీఎల్ కెరీర్లో ధోనీ ఇప్పటి వరకు 278 మ్యాచ్లు ఆడి 5439 పరుగులు చేశాడు.
ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే ఐదు టైటిళ్లు అందుకుంది. ప్రస్తుతం కెరీర్లో 19వ ఐపీఎల్ సీజన్ ఆడుతున్న ధోనీ, ఇంకొన్నేళ్లు సీఎస్కేలో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ధోనీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్య మాత్రం త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.ఒకవేళ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినా సీఎస్కేతోనే తన ప్రయాణం కొనసాగిస్తాడంటూ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ కాశీవిశ్వనాథ్ కూడా పేర్కొన్నారు. ధోనీ రిటైర్మెంట్ దృష్ట్యానే సంజూ శాంసన్ను రాజస్థాన్ నుంచి ట్రేడ్ చేసి మరీ దక్కించుకున్నారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ధోనీ రిటైర్మెంట్ ప్రస్తావన ప్రతి ఐపీఎల్లో అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోతోంది.