ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కుర్రాడు సమీర్ రిజ్వీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో 'ఇంపాక్ట్ ప్లేయర్'గా బరిలోకి దిగి రెండింటిలోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మొదటి మ్యాచ్లో 47 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన సమీర్ రిజ్వీ.. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్లో ఏకంగా 51 బంతుల్లో 90 పరుగులు పిండుకున్నాడు. సమీర్ రిజ్వీ ఆడుతున్న తీరు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులన్నీ గజగజలాడాల్సిందే అన్నట్లుగా ఉంది.
ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సమీర్ రిజ్వీ ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. 163 పరుగుల ఛేదనలో ఢిల్లీ కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన సమీర్ రిజ్వీ.. 7 ఫోర్లు, 7 సిక్సర్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో పాతుమ్ నిస్సంక, డేవిడ్ మిల్లర్తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి.. మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీకి విజయాన్ని అందించాడు. ముంబైపై ఢిల్లీ తరఫున ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును సమీర్ రిజ్వీ సమం చేశాడు.అయితే సమీర్ రిజ్వీ ఇలా మెరుపులు మెరిపిస్తుంటే.. సోషల్ మీడియాలో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్రోలింగ్కు గురవుతోంది. 2024 వేలంలో సమీర్ రిజ్వీని 8.4 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్కే.. కేవలం ఓ ఏడాది తర్వాత సమీర్ రిజ్వీని వదిలేసింది.
ఆ తర్వాత జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 95 లక్షలకే రిజ్వీని సొంతం చేసుకుంది. ఇప్పుడు తక్కువ ధరకు దొరికిన ఈ ఆణిముత్యం ఢిల్లీకి మ్యాచ్ విన్నర్గా మారడంతో ఇంతటి టాలెంట్ను సీఎస్కే ఎలా వదిలేసింది అంటూ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎస్కే యాజమాన్యం పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసిందంటూ సీఎస్కే ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తన సంచలన ఫామ్పై సమీర్ రిజ్వీ స్పందిస్తూ.. గతేడాది కాలంగా తన బలహీనతలపై కఠినంగా శ్రమించానని వెల్లడించాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో ఎదురైన సమస్యలను అధిగమించేందుకు పడిన కష్టం ఇప్పుడు ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నాడు. పిచ్ పరిస్థితులు, మ్యాచ్ గమనాన్ని బట్టి ఆడుతున్నానని..క్రీజులో సెటిల్ అయిన తర్వాతే షాట్లకు వెళ్తున్నానని సమీర్ రిజ్వీ వెల్లడించాడు.