చెన్నై సూపర్ కింగ్స్ ను 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తుపై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ సంచలన ప్రకటన చేశారు. మోకాలి గాయం కారణంగా ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్క మ్యాచ్లో కూడా స్టేడియంలోకి దిగలేకపోయాడు. దీంతో ధోనీ ఐపీఎల్ కెరీర్ ముగిసిపోయిందనే చర్చలు జోరందుకున్న తరుణంలో కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ.. ధోనీ జట్టులో ఏ పాత్రలో ఉండాలనుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అది పూర్తిగా ధోనీ వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ధోనీ సీఎస్కే జట్టులోనే శాశ్వతంగా కొనసాగాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
కోచ్గా మారతాడా లేదా మెంటార్గా సేవలందిస్తాడా అనేది పూర్తిగా ఆయన ఇష్టమన్నారు. సీఎస్కేకు సంబంధించిన ఏ నిర్ణయమైనా ధోనీ అభిప్రాయం పైనే ఆధారపడి ఉంటుందని సీఈఓ పేర్కొన్నారు. ధోనీ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ.. వచ్చే సీజన్ నాటికి ఎంఎస్ ధోనీ సీఎస్కే మేనేజ్మెంట్లో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ఊహాగానాలకు ఈ కామెంట్స్ మరింత బలాన్ని చేకూర్చాయి.ధోనీ తర్వాత సీఎస్కే సారథ్య బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీపై వస్తున్న విమర్శలకు కాశీ విశ్వనాథన్ అడ్డుకట్ట వేశారు. రుతురాజ్ దాదాపు మూడు, నాలుగు ఏళ్ల పాటు ధోనీని చాలా దగ్గరగా గమనించిన తర్వాతే కెప్టెన్సీని అందుకున్నాడనీ చెప్పారు.
రాబోయే రోజుల్లో సీఎస్కేలోకి వచ్చే యువ క్రికెటర్లలో కూడా రుతురాజ్ ఇదే నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాడనే పూర్తి నమ్మకం తమకుందన్నారు. ఇదిలా ఉంటే ఈ ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ధోనీ మైదానంలో లేకపోవడం జట్టుపై స్పష్టమైన ప్రభావాన్ని చూపింది. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్లలో సీఎస్కే కేవలం 6 మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించి, 12 పాయింట్లతో పట్టికలో 8వ స్థానానికి పరిమితమై ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. సీజన్ మధ్యలో జట్టు పుంజుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో లీగ్ దశలోనే సీఎస్కే ప్రయాణం ముగిసింది.