ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా భారత జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లాండ్తో జరగనున్న 3 వన్డేల సిరీస్, జింబాబ్వేతో జరగనున్న 3 టీ20ల సిరీస్ల కోసం భారత జట్టులో కీలక మార్పులను బీసీసీఐ ప్రకటించింది. వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టుతో వన్డే సిరీస్కు ముందు భారత్కు రెండు పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయి. జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రాణా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయాల కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యారు. వారి స్థానంలో ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్లకు జట్టులో చోటు దక్కింది. మూడో టీ20 సందర్భంగా హర్షిత్ రాణా గాయపడ్డాడు. ఈ గాయం కారణంగా ఇంగ్లాండ్తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కు హర్షిత్ రాణా దూరమయ్యాడు.
తదుపరి వైద్య పరీక్షలు, పునరావాసం కోసం హర్షిత్ రాణా ఇప్పుడు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి హాజరుకానున్నాడు. ఈ పరిస్థితిలో, హర్షిత్ స్థానంలో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ను భారత వన్డే జట్టులోకి తీసుకున్నారు. ప్రిన్స్ యాదవ్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో అరంగేట్రం చేసి, అక్కడ రెండు మ్యాచ్లలో మూడు వికెట్లు పడగొట్టాడు.అయితే హర్షిత్ స్థానంలో అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
న్యూజిలాండ్ సిరీస్ నుంచి సిరాజ్ భారత వన్డే జట్టుకు దూరంగా ఉన్నాడు.అదే మ్యాచ్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఎడమ కాలి తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్లో అది గ్రేడ్ 2 గాయంగా తేలింది. వైద్య సలహా మేరకు జింబాబ్వేతో జరగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు వరుణ్ చక్రవర్తిని దూరం పెట్టారు. వరుణ్ చక్రవర్తి కూడా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు హాజరవుతాడు. అక్కడ వరుణ్ చక్రవర్తి కోలుకునేవరకు పర్యవేక్షిస్తారు. దీంతో అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ను భారత టీ20 జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో కూడా రవి బిష్ణోయ్ భారత జట్టులో ఉన్నాడు.