ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 కోసం ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల బేరసారాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా గత సీజన్ వైఫల్యాల నేపథ్యంలో ముంబైను వీడబోతున్న హార్దిక్ పాండ్యా కోసం జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. దీంతో ఈ రేసులో ముందు నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ పెడుతున్న ప్రతిపాదనలు, దానికి ముంబై నుంచి వస్తున్న డిమాండ్లు ఆసక్తికరంగా ఉన్నాయి. అన్నీ కుదిరితే చెన్నై , ముంబై మధ్య చారిత్రక డీల్ జరగబోతోంది.సింగ్ ధోనీ పని దాదాపు అయిపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ కు మరో స్టార్ ఆటగాడి అవసరం వచ్చింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విజయాలు అందిస్తున్నా జట్టు బ్రాండింగ్ మాత్రం నిలిచేలా లేదు.
ఈ నేపథ్యంలో గత సీజన్ తర్వాత ముంబైకు దూరమయ్యేందుకు సిద్దమైన హార్దిక్ పాండ్యా కోసం ఇతర జట్లతో పాటు చెన్నై కూడా రేసులో నిలిచింది. అయితే ఇందుకోసం ముంబైతో చెన్నై జరుపుతున్న బేరసారాలు ఆసక్తికరంగా ఉన్నాయి. హార్దిక్ కావాలంటే ఆయుష్ మాత్రేతో పాటు 10 కోట్లు ఇవ్వాలని ముంబై ఇండియన్స్ చెన్నైను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే హార్దిక్ కోసం ఆయుష్ మాత్రేను వదులుకునేందుకు చెన్నై నిరాకరిస్తున్నట్లు సమాచారం. గత ఐపీఎల్ సీజన్లో దాదాపు 180 స్ట్రైక్ రేట్తో మెరుపులు మెరిపించిన మాత్రేను తమ భవిష్యత్తు స్టార్గా చెన్నై భావిస్తోంది.
అందుకే మాత్రేకు బదులుగా శివం దూబే లేదా డెవాల్డ్ బ్రెవిస్ లలో ఒకరిని తీసుకోమని ముంబైకి ప్రతిపాదిస్తోంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు, నగదుతో కూడిన ఈ బదిలీ ఒప్పందం విలువ దాదాపు 20 కోట్లకు పైగానే ఉంటుందని విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం ఈ రెండు దిగ్గజ ఫ్రాంచైజీల మధ్య చర్చలు ఇంకా తుది దశకు చేరుకోలేదు. ఒకవైపు యువ రక్తాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో చెన్నై, మరోవైపు భారీ ప్రయోజనాలను ఆశిస్తున్న ముంబై మధ్య ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ చెన్నై, ముంబైల మధ్య ఈ ప్రతిపాదిత ట్రేడింగ్ ఒప్పందం పట్టాలెక్కకపోతే, కోల్కతా నైట్ రైడర్స్ వంటి ఇతర ఫ్రాంచైజీలు కూడా హార్దిక్ను దక్కించుకునేందుకు రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.