కందుకూరు ఎల్ఐసీలో దొంగలు పడ్డారా..?
దేనికి అతీతం కాదేది స్కాం లకు అనర్హం అన్నట్లుగా తయారైంది పరిస్దితి.. ఆఖరికి ఎల్ఐసీ ని కూడా వదలటం లేదు..
దేనికి అతీతం కాదేది స్కాం లకు అనర్హం అన్నట్లుగా తయారైంది పరిస్దితి.. ఆఖరికి ఎల్ఐసీ ని కూడా వదలటం లేదు.. జీవిత బీమా సంస్థలో ఉన్న చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకుని కంచే చేను మేసినట్లుగా సొంత సంస్ధలో పనిచేసే ఉద్యోగులే కోట్లు స్వాహా చేసిన ఉదంతం ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది.. దీంతో రంగం లోకి దిగిన విజిలెన్స్ టీం ఏ మేరకు స్కాం జరిగిందనే అంశంపై విచారణ చేస్తుంది.. భాద్యుడైన ఉద్యోగిపై కఠిన చర్యలకు సిద్దమైంది.
ప్రకాశం జిల్లా కందుకూరు ఎల్ఐసీ బ్రాంచ్లో ఓ క్లెయిమ్ల స్కాం వెలుగు చూసింది..
నకిలీ డెత్ సర్టిఫికెట్లతో ఏకంగా మూడు కోట్ల రూపాయల వరకూ స్కాం జరగినట్లు గుర్తించారు.. ఎల్ఐసీలో పాలసీ తీసుకున్న తర్వాత పాలసీదారుడు మూడేళ్ల తర్వాత చనిపోతే.. పూర్తిస్దాయిలో లోతైన విచారణ చేయకుండానే క్లెయిమ్ను పరిష్కరిస్తారు.. ఈ నిబందనను గుర్తించిన పూజల శ్రీనివాసరావు అనే డెవలప్మెంట్ ఆఫీసర్ మూడు కోట్లు స్వాహా చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.. కందుకూరు బ్రాంచ్ లో సుదీర్ఘ కాలం పాటు ఏజెంటుగా ఉండి.. మూడేళ్ల క్రితం డెవలప్మెంట్ ఆఫీసర్ గా పదోన్నతి పొంది.. ప్రస్తుతం మార్కాపురం బ్రాంచ్లో ఉద్యోగిగా మారిన కనిగిరికి చెందిన పూజల శ్రీనివాసరావు కీలక సూత్రధారిగా తెలిసింది.. గతంలో శ్రీనివాసరావు ఏజెంట్ గా ఉన్న సమయంలో పలువురితో పాలసీలు చేయించాడు.. ఎల్ఐసీలో పాలసీ తీసుకున్న తర్వాత పాలసీదారుడు మూడేళ్ల తర్వాత చనిపోతే.. లోతైన విచారణ చేయకుండానే నామినల్ ప్రోసెస్ లో క్లెయిమ్ను పరిష్కరిస్తారన్న నిబంధనను ఉపయోగించుకున్న సదరు ఏజెంటు మామూలు పాలసీలతో పాటు కొంతమంది పేర్లతో నకిలీ పాలసీలు కూడా చేశాడు..
మూడు నాలుగేళ్లు ప్రీమియం కట్టి, ఆ తర్వాత వేర్వేరు తేదీలతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలతో క్లెయిమ్లు పెట్టారు.. పాలసీలు మొత్తం మూడేళ్లకు పైగా ప్రీమియంలు కట్టినవి కావటంతో అవన్నీ పరిష్కారమై నామినీలుగా పెట్టిన ఆయన కుటుంబసభ్యుల ఖాతాలకు నగదు కూడా జమయింది.. ఈ మొత్తం వ్యవహారంలో పాలసీలకు ఆధార్ కార్డు అనుసంధానం కాకపోవడాన్ని శ్రీనివాసరావు సద్వినియోగం చేసుకున్నట్లు సమాచారం.. ఒకే పాలసీదారుడి పేరుపై అనేక పాలసీలు చేసిన ఆయన వేర్వేరు సంవత్సరాలలో వేర్వేరు తేదీల్లో మూడు డెత్ సర్టిఫికెట్ల తీసుకుని వాటికి క్లెయిమ్లు చేశాడు.. చనిపోయాడని డెత్ సర్టిఫికేట్లు కూడా పెట్టి క్లెయిమ్ లు చేసిన సదరు వ్యక్తి పేరుతో ఇంకా రెండు పాలసీలు ఫోర్స్లో ఉండటం ఎల్ఐసీలో కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ గుర్తించింది. ఆ తర్వాత కొన్ని పాలసీలకు క్లెయిమ్లు రావడాన్ని పట్టుకోవటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ నకిలీ డెత్ క్లెయిమ్ లను గుర్తించిన వెంటనే నెల్లూరు రీజినల్ ఎల్ఐసీ ఆఫీసు ఈ అక్రమాన్ని సమగ్ర విచారణకు విజిలెన్స్ టీంను నియమించింది. నకిలీ డెత్ సర్టిఫికెట్లతో క్లెయిమ్ చేసిన పాలసీలకు కొన్నింటికి నామినీదారులుగా శ్రీనివాసరావు కుటుంబసభ్యులే ఉండగా.. మరికొన్ని పాలసీల నామినీదారులు కూడా తమ అకౌంట్కు సొమ్ము జమ కాగానే.. ఆ మొత్తాన్ని ఆయన బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించారు. సదరు ఏజెంటు 2023లో ఎల్ఐసీ డెవల్పమెంట్ ఆఫీసర్గా ఉద్యోగం పొందగా, అంతకుముందు ఏజెంటుగా ఉన్న కాలంలో రెండేళ్లపాటు ఈ వ్యవహారం నడిపించినటు విజిలెన్స్ టీం గుర్తించింది. ఆయన స్కాం జరిగినట్లు అనుమానిస్తున్న మొత్తం 97 క్లైమ్లకు సంభందించి సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉన్న శ్రీనివాసరావుకు సస్పెన్షన్ చేసిన ఎల్ఐసీ ఉన్నతాధికారులు.. ఆయనపై క్రిమినల్ చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. విచారణ పూర్తయిన అనంతరం ఎంత మొత్తంలో ఈ నకిలీ డెత్ సర్టిఫికేట్ల స్కాంలో స్వాహా జరిగిందన్న అంశంపై విజిలెన్స్ టీం వివరాలు వెల్లడించనుంది.. మొత్తం మీద ఈ వ్యవహారంతో ప్రకాశం జిల్లాలో ఎల్ఐసీ పాలసీదారులు ఉలిక్కిపడ్డారు.. ఇలాంటి వ్యవహారాలు ఇతర బ్రాంచుల్లో ఏమైనా జరిగి ఉంటాయా అనే కోణంలో సైతం సాఫ్ట్ వేర్ లో గుర్తించే పనిలో పడ్డారు..











