Tamilisai Soundararajan: చెన్నై సౌత్ బరిలో తమిళి సై.. బీజేపీ మూడో జాబితా విడుదల..!

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై చెన్నై సౌత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2001లో ఆమె బీజేపీలో జాయిన్ అయినప్పుడు మొదటిసారిగా పార్టీ పదవి ఇక్కడి నుంచే దక్కింది.

Post Published By: narender Thiru
Updated : 21 March 2024, 7:02 PM IST

Tamilisai Soundararajan: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై చెన్నై సౌత్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. తమిళనాడు అభ్యర్థులకు సంబంధించి మూడో జాబితాను బీజేపీ తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కోయంబత్తూరు నుంచి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నిలబడుతున్నారు. నీల్ గిరీస్ నుంచి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, కన్యాకుమారి నుంచి రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు.

T CONGRESS: ఎన్నికల తర్వాత సీఎంగా పొంగులేటి..? కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..?

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై చెన్నై సౌత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2001లో ఆమె బీజేపీలో జాయిన్ అయినప్పుడు మొదటిసారిగా పార్టీ పదవి ఇక్కడి నుంచే దక్కింది. కాంగ్రెస్‌కు చెందిన కుమారి అనంతన్ కూతురు అయిన తమిళిసై సౌందరరాజన్ 2001లో బీజేపీలో జాయిన్ అయ్యారు. చెన్నై సౌత్ డిస్ట్రిక్ట్‌లో మెడికల్ వింగ్ సెక్రటరీగా మొదట నియమితులయ్యారు. ఆ తర్వాత 2007లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2010లో తమిళనాడు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2013 దాకా జాతీయ కార్యదర్శిగా కూడా తమిళిసై కొనసాగారు. ఆగస్టు 2014 నుంచి తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2019 వరకూ ఈ పదవిలో కొనసాగిన తమిళిసైని కేంద్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 1 నాడు తెలంగాణ గవర్నర్‌గా నియమించింది. ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 16న పుదుచ్చేరి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. తమిళి సౌందరరాజన్ రెండుసార్లు ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలవలేదు. 2019లో ఆమె తూత్తుకుడి పార్లమెంట్ నియోజకవర్గంలో కరుణానిధి కూతురు కనిమొళి మీద పోటీ చేసి ఓడిపోయారు.

తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన తమిళిసై ఈనెల 18న రాజీనామా చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మురుగన్ సమక్షంలో చెన్నైలో తిరిగి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు బీజేపీ ప్రకటించిన మూడో లిస్టులో తమిళసైకి చెన్నై సౌత్ పార్లమెంట్ టిక్కెట్ ను బీజేపీ కట్టబెట్టింది. కాంచీపురం జిల్లా పరిధిలో ఉన్న చెన్నై సౌత్ నియోజకవర్గంలో దాదాపు 19 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 96శాతం జనం నగర ప్రాంతంలోనే ఉన్నారు. ఎస్సీ జనాభా 12.54 శాతం ఉంది. చెన్నై సౌత్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రస్తుతం డీఎంకేకు చెందిన తమిళాచి తంగపాండియన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019లో అన్నా డీఎంకే అభ్యర్థి డాక్టర్ జయవర్దన్ మీద 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మళ్ళీ ఈ ఇద్దరి మీదే బీజేపీ అభ్యర్థిగా తమిళిసై పోటీ చేయబోతున్నారు.

Published : 
  • 21 March 2024, 7:02 PM IST