Medaram Jathara: మేడారం జాతర ప్రారంభం.. వనం బాట పట్టిన జనం..

జాతర ప్రారంభానికి వారం పదిరోజుల ముందు నుంచే భక్తులు మేడారం తరలి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో ఇప్పటికే అడవంతా జనంతో నిండిపోయింది. ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలంలో ఉంది మేడారం.

Post Published By: narender Thiru
Updated : 21 February 2024, 3:07 PM IST

Medaram Jathara: ఆసియాలోనే అతిపెద్దదైన వనజాతర మేడారం నేటి నుంచి ప్రారంభంకానుంది. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క- సారలమ్మ జాతరకు ఊళ్లకు ఊళ్లే కదిలి వెళ్తున్నాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర చూసి.. వనదేవతలను పూజించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు జనం వనం బాట పట్టారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ కుంభమేళాను తలపిస్తున్నాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జాతర జరగనుంది. కేవలం తెలంగాణ నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు మేడారం జాతకు వస్తుంటారు. దీంతో అందుకు తగ్గట్టుగానే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.

PAWAN KALYAN: పవన్‌ పోటీ చేసే స్థానం ఫిక్స్‌.. భీమవరం నుంచే జనసేనాని

జాతర ప్రారంభానికి వారం పదిరోజుల ముందు నుంచే భక్తులు మేడారం తరలి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో ఇప్పటికే అడవంతా జనంతో నిండిపోయింది. ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలంలో ఉంది మేడారం. ఇది ఒక గిరిజన గ్రామం. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టనట్టు చూపించే వనజాతరే ఈ మేడారం జాతర. ఇక్కడ ఎలాంటి విగ్రహాలు ఉండవు. చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను కుంకుమ భరిణి రూపంలో తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఈ గిరిజన దేవలతకు మొక్కులు తీర్చడానికి బెల్లాన్ని సమర్పిస్తారు. దీన్ని బంగారంగా భావిస్తారు. మేడారం జాతర మహత్తర ఘట్టం మంగళవారమే ప్రారంభమైంది. సమ్మక్క భర్త పగిడిద్దరాజు ఆలయంలో పెనుక వంశీయులు, పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. పగిడిద్దరాజును పడగ రూపంలో పట్టుకొని మేడారానికి బయల్దేరారు. మహబూబాబాద్‌ నుంచి 70 కిలోమీటర్ల పయనం తర్వాత ఈ సాయంత్రానికి జంపన్నవాగు వద్దకు చేరుకుంటారు.

CONGRESS MP TICKETS: కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్లపై క్లారిటీ.. ఢిల్లీ టూర్‌లో ఏం చెప్పారంటే..

అక్కడ కొక్కెర వంశీయులు వారికి స్వాగతం పలుకుతారు. పగిడిద్దరాజుకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ప్రతిగా సమ్మక్కకు పెనుక వంశీయులు చీర, పసుపు, కుంకుమ పెడతారు. రాత్రి 9 గంటలకు పగిడిద్దరాజు సారలమ్మ, గోవిందరాజుతో కలిసి గద్దెలపై కొలువుదీరుతారు. వనం నుంచి దేవతల రాకతో ప్రారంభమయ్యే ఈ జాతర.. తిరిగి దేవతల వన ప్రవేశంతో ముగుస్తుంది. ప్రతి ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క-సారలమ్మ జాతరను జాతరను జరుపుకుంటారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 నుంచి మేడారం జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ఈ ఏడాది ఈ మహా జాతర కోసం 110 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అటవీ ప్రాంతంలో జాతర కావడంతో భక్తులకు ఎలాంటి ప్రయాణ అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు. రాష్ట్రం నలుమూలల నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

14 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం గస్తీ కాస్తున్నారు పోలీసులు. జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా మొక్కులు చెల్లించుకోవడం, ప్రసాదం స్వీకరించే వెసులుబాటు కూడా ఆర్టీసీ తీసుకొచ్చింది. ఈ మహా జాతరకు హాజరయ్యేందుకు ఫిబ్రవరి 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరుగా రానున్నారు. వీరితోపాటు మంత్రులు, ఇతర నేతలు వనదేవతలకు పూజలు చేయనున్నారు.

Published : 
  • 21 February 2024, 3:07 PM IST