Once again Advani is unwell.. He was rushed to the hospital..
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (96) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను బుధవారం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. డా. వినీత్ సూరీ ఆధ్వర్యంలో అద్వానీకి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. 96 ఏళ్ల అద్వానీ ఆరు రోజుల క్రితం కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స అందించారు. గత నెల 26న అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్న కారణంగా వైద్యులు సర్జరీ చేసి డిశ్చార్జ్ చేశారు.
అద్వానీ క్షేమంగా తిరిగి రావాలని బీజేపీ శ్రేణులు, నేతలు పూజలు చేస్తున్నారు. అద్వానీ కృషితోనే నేడు బీజేపీ దేశాన్ని పరిపాలించగల్గుతుందని.. ప్రపంచంలోని అతి పెద్ద పార్టిగా బీజేపీ అవతరించిందని.. అలాంటి నేత పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగిరావలని.. ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ప్రధాని మోదీ సైతం అద్వానీ ఆరోగ్య పరిస్ధితి గురించి ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలను అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో అద్వానీకి మైరుగైన వైద్యం అందించాలని మోదీ వైద్యులకు సూచించారు.