తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ట్రైనీ IPS అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తోటి మహిళా ఆఫీసర్పై లైంగిక దాడి, బెదిరింపుల ఆరోపణలతో అరెస్టయిన ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, ఈ విచారణలో పోలీసులు అడిగే ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి ఇస్తున్న సమాధానాలు, తిరిగి వేస్తున్న ఎదురు ప్రశ్నలు చూసి పోలీసు అధికారులే తీవ్ర విస్తుపోతున్నారట! అసలు రెండో రోజు విచారణలో ఏం జరిగింది? విచారణాధికారులకు ఉదయ్ ఇచ్చిన షాకింగ్ కౌంటర్లు ఏంటి? ముందుగా ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత తీవ్రంగా శ్రమించి UPSC క్లియర్ చేసి 2025 బ్యాచ్ IPS సాధించారు. నేషనల్ పోలీస్ అకాడమీ లో శిక్షణ పొందుతున్న సమయంలో, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ మహిళా ట్రైనీ IPS తో అతనికి సాన్నిహిత్యం ఏర్పడింది.
అయితే, ఉదయ్ ప్రవర్తన, మానసిక వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక సదరు మహిళా అధికారిణి అతడికి దూరంగా ఉంటూ వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయినా సరే, ప్రైవేట్ చాట్లు బయటపెడతానని, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వేధింపులకు గురిచేయడంతో పాటు దాడికి పాల్పడ్డాడని బాధితురాలు హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జులై చివరి వారంలో అరెస్టయిన ఉదయ్ను కోర్టు చంచల్గూడ జైలుకు పంపింది.కోర్టు అనుమతితో ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో డిసిపి లావణ్య నాయక్ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా ప్రశ్నించారు.
సాధారణంగా నిందితులు పోలీస్ విచారణ అంటే భయపడతారు.
కానీ ఉదయ్ కృష్ణారెడ్డికి లా చదువు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ అండ్ అవుట్స్ పూర్తిగా తెలుసు! దీంతో విచారణాధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు అతడు ఏమాత్రం తడుముకోకుండా జవాబులు ఇస్తూ, చట్టపరమైన లొసుగులను ప్రస్తావిస్తూ కౌంటర్లు ఇచ్చాడని సమాచారం.బాధితురాలు చేసిన ఆరోపణలకు సంబంధించి డిజిటల్ ఆధారాలు, ల్యాప్టాప్ ధ్వంసం, మెసేజ్ల గురించి ప్రశ్నించగా... 'మీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటి? అవి చట్టపరంగా చెల్లుతాయా?' అంటూ ఎదురు ప్రశ్నలు వేసి అధికారులను ఆశ్చర్యపరిచినట్లు వార్తలు వస్తున్నాయి.
విచారణలో పోలీసులు సేకరించిన కొత్త ఆధారాల ప్రకారం... ఉదయ్ కృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్కు చెందిన మరొక మహిళతో కూడా సత్సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ చేపట్టారు. దీనిపై ప్రశ్నించగా, తన వ్యక్తిగత విషయాలను కేసుతో ముడిపెట్టవద్దని ఘాటుగానే బదులిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉదయ్ తరఫు న్యాయవాదులు కూడా ఈ కేసులో పోలీస్ కస్టడీ అవసరం లేదని, కేవలం లీగల్ ప్రాసెస్ ప్రకారమే విచారణ జరగాలని వాదిస్తున్నారు. స్వయంగా ఒక ఐపీఎస్ అధికారి అయ్యి ఉండి, విచారణ అధికారులనే ఎదుర్కోవడం ఇప్పుడు పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని మళ్లీ కోర్టు ముందు హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలుకు తరలించనున్నారు. విచారణలో లభించిన డిజిటల్ ఎవిడెన్స్, ఫోన్ డేటాను ఫోరెన్సిక్కు పంపించారు. మరోవైపు నేషనల్ పోలీస్ అకాడమీ కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ అంతర్గత విచారణను వేగవంతం చేసింది. కఠినమైన భారత్ న్యాయ సంహిత మరియు IT యాక్ట్ సెక్షన్ల కింద నమోదు చేయబడిన ఈ కేసు ఉదయ్ కెరియర్ ను పూర్తిగా మార్చేసింది.