గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'X' సహా ఇతర ఫ్లాట్ఫామ్స్ లో ఒక విచిత్రమైన పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అదే 'కాక్రోచ్ జనతా పార్టీ'. మొదట ఇదొక సాధారణ మీమ్ లేదా జోక్ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఇదొక పెద్ద సామాజిక మరియు రాజకీయ చర్చకు దారితీసింది. ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సోషల్ మీడియాలో దారుణమైన కుల వివక్ష దాడులను ఎదుర్కొంటున్నారు. అసలు ఎవరీ అభిజీత్ దిప్కే..? అతను స్థాపించిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఉన్న కథ ఏంటి..? భారతదేశంలోని నిరుద్యోగ యువతకు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలకు మరియు ఈ పార్టీకి ఉన్న కనెక్షన్ ఏంటి..? అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే.. సుప్రీంకోర్టులో జరిగిన ఒక కేసు విచారణ సందర్భంగా, దేశంలోని నిరుద్యోగ యువతను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ కొన్ని వ్యాఖ్యలు చేశారని ఒక వార్త బయటకు వచ్చింది. ఆయన యువతను 'కాక్రోచ్లు', 'పరాన్నజీవులు' అని సంబోధించినట్లు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, దీనిపై చీఫ్ జస్టిస్ తర్వాత స్పష్టతనిచ్చారు. మీడియా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని, 'మిస్కోట్' చేసిందని ఆయన క్లారిఫై చేశారు.
కానీ ఈలోపే సోషల్ మీడియాలో యువత ఈ 'కాక్రోచ్' అనే పదాన్ని ఒక ట్రెండ్గా మార్చేశారు. ఈ క్రమంలోనే డిజిటల్ క్రియేటర్ మరియు యాక్టివిస్ట్ అయిన అభిజీత్ దిప్కే వినూత్నంగా ఆలోచించి 'కాక్రోచ్ జనతా పార్టీ' ని తెరపైకి తెచ్చారు. అభిజీత్ దిప్కే బోస్టన్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేసిన పూణేకు చెందిన డిజిటల్ యాక్టివిస్ట్ మరియు మాజీ ఆప్ వాలంటీర్. ఇది కేవలం మీమ్స్కే పరిమితం కాలేదు.. ఈ పేరుతో ఇప్పటికే మూడు ట్రేడ్మార్క్ ఫైలింగ్స్ కూడా నమోదయ్యాయంటే ఈ మూవ్మెంట్ ఎంత సీరియస్గా మారుతుందో అర్థం చేసుకోవచ్చు.ఇంతవరకు బాగానే ఉన్నా, అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే.. గురువారం నాడు అభిజీత్ దిప్కే ఒక ట్వీట్ చేస్తూ తాను ఒక 'దళిత' సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని బహిరంగంగా ప్రకటించారు.
అతను ఈ విషయాన్ని వెల్లడించిన వెంటనే, సోషల్ మీడియాలోని ఒక వర్గం నెటిజన్లు అతనిపై విపరీతమైన కుల వివక్ష కామెంట్లు చేయడం ప్రారంభించారు. అతని కులాన్ని టార్గెట్ చేస్తూ, అతను చేస్తున్న డిజిటల్ ప్రచారాన్ని తక్కువ చేసి చూపిస్తూ తీవ్రమైన ట్రోలింగ్ మరియు వ్యక్తిగత దాడులకు దిగారు.ఒక సామాజిక అంశంపై డిజిటల్ ప్లాట్ఫారమ్లో గళం ఎత్తినందుకు, కేవలం అతని కులం కారణంగా ఇంతలా వేధించడం ఇప్పుడు ఇంటర్నెట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అభిజీత్కు మద్దతుగా చాలా మంది నిలబడుతున్నారు. ఇంటర్నెట్ యుగంలో ఒక సరికొత్త పొలిటికల్ మీమ్ లాగా ప్రారంభమైన 'కాక్రోచ్ జనతా పార్టీ'.. నేడు సోషల్ మీడియాలో జరుగుతున్న కుల వివక్షకు ఒక అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యంలో లేదా డిజిటల్ స్పేస్లో ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంది. కానీ ఒక వ్యక్తి ఐడెంటిటీని లేదా కులాన్ని బట్టి వారిపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.