ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ పనిచేసింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి లో జరిగిన స్వర్గీయ ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు టిడిపి జనసేన నేతలు దూరంగా ఉన్నారు.అనవసరపు వివాదాల్లో చిక్కుకోకుండా ముందు జాగ్రత్తగా టిడిపి జనసేన కాపు నేతలు ముద్రగడ సంస్మరణ సభ నుంచి ముందుగానే తప్పుకున్నారు. కిర్లంపూడి ముద్రగడ ఇంటి ప్రాంగణంలో జరిగిన సభకి కేవలం వైసీపీ నేతలు, కార్యకర్తలు, ముద్రగడ అభిమానులు, తటస్థంగా ఉండే కాపు నేతలు మాత్రమే హాజరయ్యారు. బెజవాడలో జరిగిన సంస్మరణ సభలో టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా అంబటి రాంబాబు తో కలుపుగోలుగా తిరగడం, బోండా కి టిడిపి అధిష్టానం షోకాజ్ నోటీస్ ఇచ్చి.... త్రిసభ్య కమిటీతో విచారణ చేయించడం తెలిసిందే. దీనిపై ఏపీలో పార్టీల్లోనూ, కాపు సామాజిక వర్గంలోనూ నానా యాగి జరిగింది. రాష్ట్రంలో కాపులను విడదీశారా?
వైసీపీ కాపులు.... టిడిపి కాపులు అని రెండు వర్గాలుగా విడగొట్టారా? వైసిపి కాపులు పక్కన టిడిపి కాపులు కూర్చోకూడదా? ఇలా రకరకాల ప్రశ్నలతో కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. వైసీపీ నిర్వహించే సంస్మరణ, సాంస్కృతిక సమావేశాలకు టిడిపి నుంచి ఎవరు హాజరు కాకూడదు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేయడంతో.... కిర్లంపూడి లో జరిగిన ముద్రగడ సంస్మరణ సభకు టిడిపి జనసేన నేతలు పూర్తిగా దూరమయ్యారు. అయితే విశాఖలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగానేతలు, ఎమ్మెల్యేలు ,ఎంపీలు అక్కడికి వెళ్లడం వలన హాజరు కాలేకపోయి ఉండవచ్చని కొందరు చెప్తున్నారు.
కానీ చంద్రబాబు వ్యాఖ్యలతోనే కూటమి నేతలు ఎవరు ముద్రగడ సంస్కరణ సభకు రాలేదని, భోగాపురం ప్రారంభోత్సవాన్ని ఒక సాకుగా చూపెడుతున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. ముద్రగడ సంస్కరణ సభకు దూరంగా ఉండటం వల్ల ప్లస్లు, మైనస్లు అటుంచి... లేనిపోని వివాదాలకు తావివ్వకూడదని బాబు కఠిన నిర్ణయం తీసుకోవడంతో.... కూటమిలో కాపు నేతలు ముద్రగడ సంస్కరణ సభకు దూరంగా ఉన్నారు. అది పూర్తిగా వైసిపి నిర్వహిస్తున్న సంస్మరణ సభ మాత్రమేనని.... అందువల్ల ఆ సభకు వెళ్లి లేనిపోని రచ్చ సృష్టించుకోకూడదని , ఇరుక్కోకూడదని టిడిపి జనసేన నేతలు డిసైడ్ అయినట్లు సమాచారం.