మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అనిల్కు...రాజకీయాలపై విరక్తి వచ్చేసిందా ? పార్టీలో మంచి గుర్తింపు ఉన్న ఆయన...కొత్త పల్లవి ఎందుకు అందుకున్నారు ? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడ్ అయ్యారా ? లేదంటే అధినేత జగన్ టకెట్ ఇవ్వకూడదని భావిస్తున్నారా ? ఇదే తెలిసే...పోటీ చేయనని ప్రకటించారా ? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది.మాజీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్కుమార్...వైసీపీ అధినేత జగన్కు వీర విధేయుడు. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ వెంటే నడిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు...జగన్మోహన్రెడ్డి కేబినెట్లో చోటు సంపాదించారు. నీటి పారుదల శాఖ మంత్రిగా రెండున్నరేళ్లు పని చేశారు. ఆ సమయంలో ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ ఒంటి కాలితో లేచారు.
అసెంబ్లీ లోపల, బయట...మాటకు మాట సమాధానం చెప్పారు. 2024 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిల్కుమార్...ఊహించని ప్రకటన చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి...వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది అనుమానమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు రెండున్నరేళ్లు ఉండగానే...ఆయన ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.వైసీపీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్కుమార్కు రాజకీయాలపై విరక్తి కలిగిందా ? లేదంటే ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా ? తగ్గించారా ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వైసీపీలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ ఉందని చెప్పడం...మంత్రిగా పని చేశానని చెప్పడం వెనుక ఏం జరిగిందని చర్చించుకుంటున్నారు. అనిల్కుమార్ వ్యాఖ్యలు వెనుక ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా ? అంటూ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో సీటు వచ్చినా, రాకపోయినా అని ఎందుకన్నారు ? ఇంతకీ అనిల్కుమార్కు ఏమైంది అని ఏపీలో మాట్లాడుకుంటున్నారు. 2014,2019లో నెల్లూరు సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. 2019లో నర్సరావుపేట పార్లమెంట్ నుంచి పోటీ చేసి...లావు కృష్ణదేవరాయులు చేతిలో ఓటమి పాలయ్యారు. నెల్లూరు సిటీ స్థానం కాదని...నర్సరావుపేట పార్లమెంట్కు పోటీ చేయడంతో పరాజయం చెందారు. సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయలు స్థానికుడు కావడం...అనిల్ స్థానికేతరుడు కావడంతో...ఎంపీగా ఓడిపోయారు. మరోవైపు నెల్లూరు సిటీ నుంచి మైనార్టీ నేత ఖలీల్ అహ్మద్కు వైసీపీ ఛాన్ ఇచ్చింది. దీంతో అనిల్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ తేడాతో ఖలీల్ అహ్మద్ ఓడిపోగా, తర్వాత నెల్లూరు సిటీ ఇంచార్జిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
నెల్లూరు సిటీ ఇన్చార్జ్గా పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిని నియమించడంతో...అనిల్కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ సీటు ఇవ్వడం లేదనే సంకేతాలు అనిల్కుమార్కు వచ్చాయా ? లేదంటే ఆయనకు ఆయనే...పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారా ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతానికి సొంత నియోజకవర్గం అంటూ ఏదీ లేకపోవడంతో...తన రాజకీయ ప్రస్థానం ముగిసిందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే జిల్లా రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. అప్పుడప్పుడు పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే మునుపటి దూకుడు మాత్రం ప్రదర్శించడం లేదు. వ్యూహాత్మకంగా తన భవిష్యత్తుపై క్లారిటీ కోసం పోటీ చేసే అవకాశాలు లేవంటూ అధిష్టానానికి సంకేతాలు పంపారా? అని పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో తనకు ఏ బాధ్యత లేదని చెప్పడమే కాకుండా, తనకు అవకాశం ఇస్తే అధినేత ఆకాంక్షలకు తగినట్లు పనిచేస్తానని చెప్పడమే అనిల్ కుమార్ అంతరంగం కావొచ్చునని భావిస్తున్నారు.