Praggnanandhaa: ఆనంద్ మహీంద్రా రిప్లయ్‌కు ఫ్యాన్స్ ఫిదా..!

చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానందను అభినందిస్తూ ఆనంద్ మహీంద్రా ఇటీవల ఓ బహుమతి ప్రకటించారు. అతడి తల్లిదండ్రులు నాగలక్ష్మీ, రమేశ్‌ బాబుకు XUV400 ఈవీని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని ఎక్స్‌‌లో వెల్లడించారు.

Post Published By: narender Thiru
Updated : 30 August 2023, 6:32 PM IST

Praggnanandhaa: చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచినా సరే.. తన ప్రతిభతో కోట్లాది మంది భారతీయుల మనసులు గెల్చుకున్నాడు చెన్నై చిన్నోడు ప్రజ్ఞానంద. ఈ నేపథ్యంలో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానందను అభినందిస్తూ ఆనంద్ మహీంద్రా ఇటీవల ఓ బహుమతి ప్రకటించారు. అతడి తల్లిదండ్రులు నాగలక్ష్మీ, రమేశ్‌ బాబుకు XUV400 ఈవీని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని ఎక్స్‌‌లో వెల్లడించారు. దీనికి మహీంద్రా అండ్‌ మహీంద్రా సీఈఓ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేశ్ జెజురికర్‌ స్పందిస్తూ.. ఆనంద్‌ మహీంద్రా ఆలోచనను అభినందించారు.

వెంటనే XUV400 ప్రత్యేక ఎడిషన్‌ ఈవీని అతడి తల్లిదండ్రులకు డెలివరీ చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ప్రజ్ఞానంద స్పందిస్తూ ఆనంద్‌ మహీంద్రాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ‘‘ధన్యవాదాలు చెప్పేందుకు నాకు మాటలు కూడా రావట్లేదు. ఈవీ కారును కొనుగోలు చేయాలనేది మా అమ్మానాన్న చిరకాల కల. దాన్ని నిజం చేసినందుకు ఆనంద్‌ మహీంద్రా సర్‌, రాజేశ్ సర్‌కు కృతజ్ఞతలు’’ అని ప్రజ్ఞానంద ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా బదులిస్తూ.. ‘‘కార్ల తయారీదారుల అంతిమ లక్ష్యం.. కస్టమర్ల కలలను నెరవేర్చడమే’’ అంటూ రాసుకొచ్చారు.

ప్రతిభను ప్రోత్సహించడంలో ఆనంద్ మహీంద్రా మళ్ళీ తన మంచి మనసును చాటుకున్నాడు అంటూ, క్రీడా అభిమానులు సైతం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో తమ విషెస్ తెలియజేస్తున్నారు.

Published : 
  • 30 August 2023, 6:32 PM IST