ఫిఫా ప్రపంచకప్ ముగిసి నాలుగు రోజులైనా కాకముందే మరో క్రీడా సంబరం వచ్చేస్తోంది. గురువారం నుంచే గ్లాస్గో వేదికగా కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత అథ్లెట్ల బృందం ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతోంది. మరి ఈ సారి కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ ఎన్ని పతకాలు గెలుస్తుందన్న ఆసక్తి క్రీడాభిమానుల్లో ఉంది. గతంలో పోలిస్తే ఈ సారి భారత్ పతకాల సంఖ్య తగ్గిపోనుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కామన్ వెల్త్ గేమ్స్ లో మన క్రీడాకారులు సాధించిన ఈవెంట్లలో చాలా వాటిని ఇప్పుడు తొలగించారు. అయితే, ఈసారి బడ్జెట్ పరిమితుల కారణంగా ఆతిథ్య నగరమైన గ్లాస్గో క్రీడల సంఖ్యను కేవలం 10 కి కుదించింది. దీనివల్ల భారత్కు పతకాలు గ్యారెంటీ ఇచ్చే కొన్ని ముఖ్యమైన క్రీడలు ఈసారి టోర్నీలో లేవు. రెజ్లింగ్ , బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, హాకీ , క్రికెట్ ఈ సారి కామన్ వెల్త్ గేమ్స్ లో లేవు.
గత 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 22 స్వర్ణాలతో కలిపి మొత్తం 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. గత టోర్నీలో భారత్ సాధించిన 61 పతకాలలో 30 పతకాలుఈ తొలగించిన క్రీడల నుండే వచ్చాయి. ఈసారి పతకాల సంఖ్య గతంతో పోలిస్తే తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న క్రీడల్లో మన అథ్లెట్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.ఈసారి 13 విభాగాల్లో పోటీ పడుతున్న భారత బృందం ప్రధానంగా అథ్లెటిక్స్ , బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ , జూడోలలో పతకాలపై ఆశలు పెట్టుకుంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ నుండి అత్యధికంగా 32 మంది పాల్గొంటున్నారు.
నీరజ్ చోప్రా ద్వారా భారత్కు జావెలిన్ త్రోలో క్లీన్ స్వీప్ లేదా ఖచ్చితమైన స్వర్ణం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ కు సంబంధించి లాంగ్ జంప్ లో మురళీశ్రీశంకర్ మెడల్ గెలిచే అవకాశాలున్నాయి. స్టీపుల్ ఛేజ్ లో పారుల్ చౌదరిపైనా అంచనాలున్నాయి. మరోవైపు బాక్సింగ్ లో ఎప్పటిలానే ఖచ్చితంగా మెడల్స్ రానున్నాయి. వరల్డ్ బాక్సింగ్ ర్యాంకింగ్స్ ప్రకారం కామన్వెల్త్ దేశాల్లో భారత మహిళా బాక్సర్లు అగ్రస్థానంలో ఉన్నారు. కనీసం 5 గురు మహిళా బాక్సర్లు ఫైనల్స్ చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వెయిట్ లిఫ్టింగ్ లోగత రికార్డుల ప్రకారం మీరాబాయి చానుకు స్వర్ణ పతకం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.అటు జూడోతో పాటు పారాస్పోర్ట్స్ లోనూ మన క్రీడాకారులు పతకాలు గెలిచే అవకాశముందని అంచనా.