భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి బీహార్- జార్ఖండ్ రీజియన్ టాప్ ట్యాక్స్ పేయర్గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి 6 ఏళ్లు గడిచినా.. అతని ఐపీఎల్ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తుతున్నా.. వాణిజ్యపరంగా తనకు తిరుగులేదని చాటుకున్నాడు. మైదానంలోనే కాకుండా వ్యక్తిగత పన్ను చెల్లింపుల విషయంలోనూ రారాజుగా నిలిచాడు.ఈ విషయాన్ని బీహార్-జార్ఖండ్ ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ డాక్టర్ డి. సుధాకర్ రావు ధ్రువీకరించారు.
తమ రీజియన్లో ధోనీ అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచారని చెప్పారు. ధోనీ చెల్లించిన పన్ను ఎంత? అనే విషయాలు గోప్యంగా ఉన్నప్పటికీ.. పన్ను చెల్లింపు విషయంలో ధోనీ బాగా సహకరిస్తున్నారని అధికారులు మీడియాకు తెలిపారు.అంతర్జాతీయ క్రికెట్కు ధోనీ 6 ఏళ్ల క్రితమే వీడ్కోలు పలికినా ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో గాయం కారణంగా ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ సీజన్తో ధోనీ కెరీర్కు ఎండ్ కార్డ్ పడుతుందని ఓ వైపు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు అతని రీఎంట్రీ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
టోర్నీ చివరి దశకు చేరిన నేపథ్యంలో ధోనీ రీఎంట్రీపై అనేక ఊహగానాలు వెలువడుతున్నాయి. ధోనీ రీఎంట్రీ ఇస్తాడని జట్టు వర్గాలు పేర్కొంటుండగా.. వీడ్కోలు మ్యాచ్ మాత్రమే ఆడుతాడని మరికొందరు అంటున్నారు. ధోనీ మునపటిలా సత్తా చాటకపోయినా.. అతని ప్రభావం జట్టుపై చాలా ఉంది. ధోనీ కోసమే మైదానానికి తరలి వచ్చే ప్రేక్షకులు కోట్లాది మంది ఉన్నారు. క్రికెట్కు దూరంగా ఉన్నా ధోనీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. దాంతో వాణిజ్య ప్రకటనలతో కోట్ల రూపాయలను ఆర్జిస్తున్న ధోనీ.. అదే స్థాయిలో పన్నులు కూడా చెల్లిస్తున్నాడు.