ఇష్టమొచ్చినట్టు తప్పుకోవడానికి ఇది గల్లీ టోర్నీనా ? పాక్ బోర్డుకు ఐసీసీ వార్నింగ్…!

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయంపై ఐసీసీ తొలిసారిగా స్పందించింది.

Post Published By: dialnews
Updated : 2 February 2026, 9:41 PM IST

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయంపై ఐసీసీ తొలిసారిగా స్పందించింది. ఈ నిర్ణయం గ్లోబల్ క్రికెట్‌కు విరుద్ధమని, దీని వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావాలు ఉంటాయని ఐసీసీ హెచ్చరించింది. పాకిస్తాన్ ప్రభుత్వం సూచనల మేరకు ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో ఆడబోమని పీసీబీ ప్రకటించింది. అయితే టోర్నీ మొత్తంలో మాత్రం పాల్గొంటామని తెలిపింది. అయితే ఇది క్రికెట్ నైతికతకు విరుద్ధమని ఐసీసీ స్పష్టం చేసింది.ఇప్పటి వరకు పీసీబీ నుంచి అధికారిక లేఖ అందలేదని ఐసీసీ వెల్లడించింది. అయినప్పటికీ, ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో నిరాశ కలిగిస్తోందని పేర్కొంది.అన్ని జట్లు సమానంగా పోటీ పడే వేదికే వరల్డ్ కప్ అనీ,. ఇష్టమొచ్చిన మ్యాచ్‌లను తప్పుకోవడం సరైన పద్ధతి కాదని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.

భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తే, పాకిస్తాన్‌ రెండు కీలక పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుంది. అంతేకాదు నెట్ రన్ రేట్‌పై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం, బాయ్‌కాట్ చేసిన మ్యాచ్‌లో 20 ఓవర్ల పూర్తి స్కోర్‌ను లెక్కలోకి తీసుకుంటారు. దీని వల్ల పాకిస్తాన్ రన్‌రేట్ భారీగా పడిపోయే అవకాశం ఉంది. మొత్తానికి, ఈ వివాదం ఇప్పుడు మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. ఐసీసీ మాత్రం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పీసీబీకి సూచిస్తోంది. ఒక దేశం కావాలనే మ్యాచ్‌ను వదిలేస్తే, టోర్నీ గౌరవం దెబ్బతింటుందని స్పష్టం చేసింది.

అలాగే, ప్రభుత్వాల పాత్రను గౌరవిస్తున్నామని చెప్పినా ఈ నిర్ణయం క్రికెట్‌కు, ముఖ్యంగా పాకిస్తాన్ అభిమానులకు కూడా మంచిది కాదని ఐసీసీ వ్యాఖ్యానించింది. దీని వల్ల పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించింది.ఈ టోర్నీలో పాకిస్తాన్ గ్రూప్-ఏలో ఉంది. భారత్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా జట్లతో కలిసి పోటీపడనుంది. పాకిస్తాన్ అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా, ఫిబ్రవరి 10న అమెరికాతో, ఫిబ్రవరి 18న నమీబియాతో తలపడనుంది.

Published : 
  • 2 February 2026, 9:41 PM IST