ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ను లఖ్నవూ సూపర్ జెయింట్స్ 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అలా రెండేళ్ల పాటు ఈ క్యాష్ రిచెస్ట్ లీగ్లో అత్యధిక ధర సొంతం చేసుకున్న ప్లేయర్ గా ఉన్న పంత్ను ఎల్ఎస్జీ ఫ్రాంఛైజీని వీడుతాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాక అతడి జీతంలో కూడా భారీ కోత పడనున్నట్లు సమాచారం.నివేదిక ప్రకారం... ఢిల్లీ క్యాపిటల్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్తో ఒక ట్రేడ్ను ప్రారంభించింది.
ఆ ఒప్పందం ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్కు పంత్ తిరిగి వస్తాడు. అతడు 2025కు ముందు వరకు ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు ఈ ట్రేడ్లో భాగంగా కుల్దీప్ యాదవ్ లఖ్నవూకు వెళ్తాడు. ఈ ఒప్పందం తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ తమ సొంత జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఒప్పందంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పంత్ తన వేతనంలో భారీ కోతకు అంగీకరించనున్నాడు.27 కోట్లకు పంత్ను తీసుకోవడం డీసీకి సాధ్యం కాలేదు.
పంత్ సవరించిన ఫీజు అతని ప్రస్తుత జీతంలో సగం కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ కీపర్ బ్యాటర్ సుమారు 15 కోట్ల ఫీజుకు అంగీకరించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మరోవైపు, లఖ్నవూ సూపర్ జెయింట్స్లో కుల్దీప్ పారితోషికం 13.25 కోట్లుగా యథాతథంగా ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ కోసం పంత్ భారీ త్యాగం చేయబోతున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఎల్ఎస్జీ 2025లో 7వ స్థానంలో, 2026లో 10వ స్థానంలో నిలిచింది. కాగాఈ ట్రేడ్ ఇద్దరు ఆటగాళ్లకు 'సొంతగూటికి చేరడం' లాంటిది. పంత్ గతంలో తొమ్మిది సీజన్ల పాటు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించగా, ఉత్తరప్రదేశ్కు చెందిన కుల్దీప్ యాదవ్ ఇప్పుడు తన సొంత రాష్ట్ర ఫ్రాంచైజీ అయిన లక్నో తరఫున ఆడనున్నాడు. ఈ భారీ ట్రేడ్పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.