ఐపీఎల్ 2026 సీజన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో ఫోన్ వాడడం, ఆ ఫోన్ను వైభవ్ సూర్యవంశీ చూడడం పెద్ద వివాదంగా మారింది. ఈ ఘటన మరువకముందే తాజాగా ఆదివారం చెన్నై సూపర్కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్జెయింట్స్ డగౌట్లో ఒక వ్యక్తి అదే పనిగా మొబైల్ ఫోన్ వాడడం కనిపించింది. సీఎస్కేతో మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో స్క్వేర్ లెగ్వైపు మిచెల్ మార్ష్ బౌండరీ కొట్టాడు.
ఈ సమయంలో రిప్లేలో లక్నో డగౌట్లో ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు కనిపించింది. అతడు పదే పదే ఫోన్లో మాట్లాడుతుండడం కనిపించడంతో, అభిమానులు మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా జరుగుతుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, మ్యాచ్ సమయంలో డగౌట్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించడం పూర్తిగా నిషేధం. ఈ ఘటనపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
ఐపీఎల్లో ప్లేయర్స్ ప్రొటోకాల్ ప్రకారం, టీమ్ మేనేజర్లు తమ ఫోన్లను కేవలం డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే వాడేందుకు అనుమతి ఉంది. డగౌట్ ఏరియా సహా మైదానంలో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్ పరికరాలు ఉపయోగించేందుకు వీలు లేదు. అయితే రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ చర్య తర్వాత బీసీసీఐ కఠిన ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన భిందర్కు రూ. లక్ష జరిమానా విధించడంతో పాటు వివరణ ఇవ్వాలని కోరింది. అయితే రోమీ భిందర్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ మరోసారి ఇది రిపీట్ చేయొద్దని హెచ్చరించింది. తాజాగా మరోసారి నిబంధనలకు విరుద్ధంగా డగౌట్లో ఫోన్ వాడడంపై బీసీసీఐ ఎలాంటి చర్యలకు దిగుతుందో చూడాలి.