చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్పై సెంచరీ బాదిన తొలి సీఎస్కే బ్యాటర్గా నిలిచాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సీఎస్కే బ్యాటర్ కూడా ముంబైపై శతకం నమోదు చేయలేదు. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లతో సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.తనదైన నిశ్శబ్ద శైలితో క్రీజులోకి అడుగుపెట్టిన చెటా.. ఆ తర్వాత గేర్లు మార్చి ప్రత్యర్థి బౌలింగ్ను విచ్ఛిన్నం చేశాడు. పవర్ ప్లేలో గ్యాప్ షాట్స్తో బౌండరీలు బాదిన సంజూ.. మిడిల్ ఓవర్లలో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో సంజూ శాంసన్ ఒకటి కాదు.. రెండు కాదు ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సీజన్లో సంజూ శాంసన్కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా.. ఓవరాల్గా 8వ టీ20 సెంచరీ. దాంతో పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ రికార్డ్ను సంజూ శాంసన్ సమం చేశాడు. ఈ జాబితాలో 9 సెంచరీలతో విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సంజూ శాంసన్ 8 శతకాలతో రోహిత్ శర్మ సరసన నిలిచాడు.ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున రెండు సెంచరీలు బాదిన రెండో బ్యాటర్గా సంజూ శాంసన్ రికార్డు సాధించాడు. 2018లో షేన్ వాట్సన్ మాత్రమే సీఎస్కే తరపున ఒకే సీజన్లో రెండు సెంచరీలు నమోదు చేశాడు.
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్పై సెంచరీ బాదిన ఏకైక సీఎస్కే బ్యాటర్ సంజూ శాంసన్ మాత్రమే. ఎందరో దిగ్గజాలు సీఎస్కే తరపున ఆడినా.. ముంబై ఇండియన్స్పై సెంచరీ సాధించలేకపోయారు. ఆ లోటును తాజా శతకంతో సంజూ తీర్చాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సంజూ శాంసన్ తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. సంజూకు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. దాంతో కేఎల్ రాహుల్ రికార్డును సంజూ సమం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తరపున ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో సంజూ చేరాడు. మురళీ విజయ్ , షేన్ వాట్సన్ , రుతురాజ్ గైక్వాడ్ తర్వాత సీఎస్కే తరఫున రెండు శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.