భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు అయ్యర్ ప్రధాన అభ్యర్థిగా నిలిచాడు. ఒక వేళ టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ను తొలగించాలని అనుకుంటే సెలక్టర్లకు ఫస్ట్ ఆప్షన్ శ్రేయస్ అయ్యరే అని నివేదికలు చెబుతున్నాయి. ఐపీఎల్ లో శ్రేయస్ నాయకత్వం పట్ల సానుకూలతతోపాటు టీ20 క్రికెట్లో నాలుగో స్థానంలో అతడి స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ మరొకరు లేరని నివేదిక పేర్కొంది. రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్ పోటీలో ఉన్నా అయ్యర్ వైపే మొగ్గు చూపుతున్నారట. బీసీసీఐ శ్రేయస్ను సరైన ఎంపికగా చూస్తోంది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున 4వ స్థానంలో అయ్యర్ కనబరిచిన బ్యాటింగ్ ప్రదర్శన అతడి అవకాశాలను మరింత పెంచిందని ఆ నివేదిక పేర్కొంది.
శ్రేయస్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఐపీఎల్ ఫైనల్కు నడిపించాడు. ఆ తర్వాత 2024లో కోల్కతా నైట్ రైడర్స్తో టైటిల్ గెలుచుకున్నాడు. పంజాబ్ కింగ్స్తో అతను 2025లో అద్భుతమైన ఫామ్ను కనబరిచి, ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ భారత్ను 2026 టీ20 ప్రపంచ కప్ టైటిల్కు నడిపించినప్పటికీ, అతని బ్యాటింగ్ ప్రదర్శన అంతగా బాగోలేదు. ఫలితంగా శ్రేయస్ గురించి చర్చ పెరిగింది.నివేదిక ప్రకారం, సెలెక్టర్లు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటే సూర్యకుమార్ స్థానంలో అయ్యర్ కచ్చితంగా ఎంపిక అవుతాడని వర్గాలు తెలిపాయి. ఇప్పుడు దృష్టి 2027 వన్డే ప్రపంచ కప్ వైపు మళ్లింది. ఇది టీ20 నాయకత్వ మార్పు కోసం ప్రణాళిక రూపొందించడానికి సెలెక్టర్లకు కొంత సమయం ఇచ్చింది.
సూర్యకుమార్ యాదవ్ భారత్ను టీ20 ప్రపంచ కప్ టైటిల్ను అద్భుతంగా కాపాడుకునేలా నడిపించినప్పటికీ, అతని నిలకడలేని బ్యాటింగ్ ఫామ్ కారణంగా 2028లో లాస్ ఏంజిల్స్లో జరిగే దేశ ఒలింపిక్స్ ప్రచార ప్రణాళికలో అతను ఉంటాడా లేదా అనే దానిపై సందిగ్ఘత నెలకొంది. ఈ నేపథ్యంలో జూన్-జూలైలో జరగనున్న ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటన కెప్టెన్కు కీలకం కానుంది. ఎందుకంటే అతని కెప్టెన్సీ కంటే ఎక్కువగా, అతని బ్యాటింగ్పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. 2028లో ఒలింపిక్స్, ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్ వంటి తదుపరి దశ పెద్ద ఈవెంట్ల వరకు అతనికి మరో రెండేళ్లు అవకాశం ఇస్తారా లేదా అనే విషయాన్ని ఈ పర్యటనే నిర్ణయించే అవకాశముంది.ఆస్ట్రేలియాలో జరిగే 2028 టీ20 ప్రపంచ కప్ వరకు కాంట్రాక్టు పొడిగింపును ఆశిస్తున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు సూర్యకుమార్ ఇప్పటికీ మొదటి ఎంపికగా ఉన్నాడు. అయితే, ఒలింపిక్స్ నాటికి టీ20 కెప్టెన్కు 38 ఏళ్లు నిండనున్నందున, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతని అభిప్రాయంతో ఏకీభవిస్తుందో లేదో చూడాలి.