చిక్కుల్లో రాజస్థాన్ అమ్మకపు డీల్ సోమానీ గ్రూప్ లీగల్ ఫైట్…!

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్‌గా భావిస్తున్న రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య మార్పిడి ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఇటీవల మిట్టల్ కుటుంబం, అదర్ పూనావాలా సుమారు 15,660 కోట్లకు ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

Post Published By: dialnews
Updated : 5 May 2026, 8:50 PM IST

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్‌గా భావిస్తున్న రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య మార్పిడి ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఇటీవల మిట్టల్ కుటుంబం, అదర్ పూనావాలా సుమారు 15,660 కోట్లకు ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తూ కాల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం ఇప్పుడు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. దీంతో ఈ మెగా డీల్ కోర్టు పరిధిలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.ఓ నివేదిక ప్రకారం.. సోమానీ గ్రూప్ ఈ డీల్ ముగింపు దశలో జరిగిన పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉంది. వాస్తవానికి అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ వారసుడు రాబ్ వాల్టన్ వంటి అంతర్జాతీయ పెట్టుబడిదారులతో కూడిన సోమానీ కన్సార్టియం.. రాజస్థాన్ రాయల్స్‌ను దక్కించుకోవడంలో రేసులో ముందుంది.

వీరు దాదాపు 15,300 కోట్లకు ఒప్పందాన్ని ఖరారు చేసే దశకు చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో తమను పక్కన పెట్టి వేరే వారితో డీల్ కుదుర్చుకోవడంపై వారు మండిపడుతున్నారు. త్వరలోనే దీనిపై లీగల్ నోటీసులు పంపనున్నట్లు ఆ గ్రూప్ వర్గాలు వెల్లడించాయి.తాము సకాలంలో నిధులు చెల్లించలేకపోయామన్న వార్తలను సోమానీ గ్రూప్ ఖండించింది. తాము గత 10 రోజులుగా డీల్ క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. కానీ ఫ్రాంచైజీ యాజమాన్యం కావాలనే ఆలస్యం చేస్తూ సమాంతరంగా ఇతరులతో చర్చలు జరిపిందని వారు ఆరోపిస్తున్నారు. అలాగే బకాయిలు, పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన కేసులు, భవిష్యత్తు నిర్వహణపై తాము అడిగిన ప్రశ్నలకు స్పష్టత ఇవ్వకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు వాదిస్తున్నారు.

ముఖ్యంగా మనోజ్ బడాలే పాత్రను పరిమితం చేయాలని సోమానీ గ్రూప్ భావించడం కూడా ఈ డీల్ చెడిపోవడానికి ఓ కారణమని తెలుస్తోంది. ప్రస్తుతానికి మిట్టల్ ఫ్యామిలీ, అదార్ పూనావాలాతో కుదిరిన ఒప్పందం కొనసాగుతోంది. ఈ ఒప్పందం ప్రకారం మిట్టల్ కుటుంబం 75శాతం, పూనావాలా 18 శాతం వాటాను తీసుకోనున్నారు. మిగిలిన 7 శాతం వాటా మనోజ్ బడాలేతో సహా ప్రస్తుత పెట్టుబడిదారుల వద్దే ఉంటుంది. అయితే ఈ డీల్ ఇంకా తుది దశకు చేరలేదు. దీనికి బీసీసీఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. సోమానీ గ్రూప్ గనుక బీసీసీఐకి ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తే, ఈ ప్రక్రియ మరింత జాప్యం అయ్యే అవకాశం ఉంది.

Published : 
  • 5 May 2026, 8:50 PM IST