ఎందుకు ఆడించట్లేదో చెప్పాల్సిందే, రోహిత్ సంచలన వ్యాఖ్యలు…!
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ జట్టు ఎంపిక విషయంపై కీలక కామెంట్స్ చేశాడు. జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టమైన విషయమని అన్నాడు.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ జట్టు ఎంపిక విషయంపై కీలక కామెంట్స్ చేశాడు. జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టమైన విషయమని అన్నాడు. అయితే ఒక ఆటగాడిని మ్యాచ్లో ఆడించకుండా, ఎందుకు పక్కన పెట్టామో అతడికి వివరించాల్సిన అవసరం ఉందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. వచ్చే నెలలో భారత్- శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్కప్నకు రోహిత్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.
జట్టును ఎంపిక చేసే ప్రక్రియ అత్యంత క్లిష్టమైనదనీ, ఈ క్రమంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ముఖ్యంగా కెప్టెన్కు ఇది అత్యంత అత్యంత క్లిష్టమైన అంశంగా చెప్పుకొచ్చాడు. జట్టు ఎంపికలో అందరినీ సంతృప్తి పర్చలేమన్న రోహిత్ అయితే ఎందుకు పక్కన పెట్టామో మాత్రం ఆటగాడికి వివరంగా చెప్పడం అనేది ముఖ్యమన్నాడు. 2022 ఆసియా కప్, టీ20వరల్డ్కప్ టోర్నీల్లో శ్రేయస్ అయ్యర్ను కాదని బౌలింగ్ చేయగలిగే దీపక్ హుడాను తీసుకున్నామని గుర్తు చేసుకున్నాడు. టీమ్ బ్యాలెన్స్గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాను, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా అయ్యర్కు వివరించామని చెప్పుకొచ్చాడు.
ఇక 2023 వన్డే వరల్డ్కప్ టోర్నమెంట్లో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో పేసర్ మహ్మద్ సిరాజ్కు కూడా ఇదే మాదిరిగా వివరించి చెప్పామన్నాడు. రానున్న టీ20 ప్రపంచ కప్లో టీమ్ఇండియా సత్తా చాటుతుందనే నమ్మకం ఉందనీ,. టీమ్లో 80 నుంచి 90 శాతం మంది ఆటగాళ్లు గత రెండేళ్లుగా కలిసే ఆడుతున్నారన్నాడు. టీమ్ యావరేజ్ వయసు 25 ఏళ్లు ఉండటం కూడా కలిసొచ్చే అంశమని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే రోహిత్ తన కెరీర్లో తొలిసారి టీ20 ప్రపంచకప్లో ఆడడం లేదు. 2007లో ప్రారంభమైన ఈ పొట్టి కప్ టోర్నీ ప్రతీ ఎడిషన్లో రోహిత్ ఆడాడు. అయితే టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో హిట్మ్యాన్ ఈసారి పొట్టికప్కు దూరమైయ్యాడు. దీంతో తొలిసారిగా ఈ టోర్నమెంట్ను ఇంటి నుంచి చూడబోతుండడం తనకు వింత అనుభవమని రోహిత్ వ్యాఖ్యానించాడు.











