బుమ్రా అయితే నాకేంటి ? సిక్సర్లతో విరుచుకుపడ్డ బుడ్డోడు…!

టీనేజ్ సెన్సేషన్, రాజస్థాన్ రాయల్స్ సిక్సర్ పిడుగు వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. వరల్డ్ బెస్ట్ పేసర్‌ను ఎదుర్కొంటున్నాననే బెరుకు లేకుండా.. తొలి బంతినే సిక్సర్ కొట్టాడు

Post Published By: dialnews
Updated : 8 April 2026, 7:08 PM IST

టీనేజ్ సెన్సేషన్, రాజస్థాన్ రాయల్స్ సిక్సర్ పిడుగు వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. వరల్డ్ బెస్ట్ పేసర్‌ను ఎదుర్కొంటున్నాననే బెరుకు లేకుండా.. తొలి బంతినే సిక్సర్ కొట్టాడు. 15 ఏళ్ల వైభవ్ సిక్సర్‌కు బుమ్రా కూడా షాక్ అయ్యాడు. ఆ తర్వాత మరో సిక్సర్‌ బాదిన వైభవ్‌.. 3 బంతుల వ్యవధిలోనే 2 సిక్స్‌లు బాది బుమ్రాకు దిమ్మతిరిగే షాకిచ్చాడు.ఈ రెండు భారీ సిక్స్‌లతో బుమ్రా నవ్వుతూ.. సిగ్గుతో తలదించుకున్నాడు. ప్రస్తుతం ఈ సిక్స్‌లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు వైభవ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో, సూర్యవంశీ కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు చేసి ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్‌గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడానికి సీనియర్ బ్యాటర్లే తడబడుతుంటారు. కానీ, 15 ఏళ్ల వైభవ్ ఏమాత్రం బెరుకు లేకుండా బుమ్రా బౌలింగ్‌లో విరుచుకుపడ్డాడు. బుమ్రా వేసిన పవర్‌ప్లే ఓవర్లలో రెండు భారీ సిక్సర్లు బాదాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లేలో బుమ్రాపై ఇన్ని సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. గతంలో విరాట్ కోహ్లీ మాత్రమే బుమ్రా పవర్‌ప్లే ఓవర్లలో మూడు సిక్సర్లు బాదాడు. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డుకు చేరువగా వచ్చి తన సత్తా చాటాడు.ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎన్ని ఫీల్డింగ్ మార్పులు చేసినా, వైభవ్ షాట్లను ఆపడం ఎవరితరం కాలేదు.

వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌లో 278.57 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు. ఐదో ఓవర్ చివరి బంతికి శార్దూల్ ఠాకూర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి, లాంగ్ ఆఫ్‌లో ఉన్న తిలక్ వర్మకు దొరికిపోయాడు. అవుట్ కావడానికి ముందు అదే ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని అద్భుత పోరాటం రాజస్థాన్ రాయల్స్‌కు భారీ స్కోరు సాధించడానికి గట్టి పునాది వేసింది.ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్, ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 122 పరుగులు చేశాడు. అతని సగటు 41.50గా ఉండగా, స్ట్రైక్ రేట్ ఏకంగా 278.57గా ఉంది. ప్రస్తుతానికి రాజస్థాన్ రాయల్స్ జట్టులో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా వైభవ్ కొనసాగుతున్నాడు. రాబోయే కాలంలో భారత క్రికెట్‌లో అతను ఒక ధృవతారగా ఎదిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Published : 
  • 8 April 2026, 7:08 PM IST