సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఫీల్డర్ల పేలవ ప్రదర్శనపై ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తీవ్ర అసంతృఫ్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో లైవ్ బ్రాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఉండగానే పంజాబ్ ఫీల్డర్లు వరుసగా క్యాచ్ లను చేజార్చడం పాంటింగ్కు ఆగ్రహం తెప్పించింది. ఒకానొక దశలో కోపం తట్టుకోలేక చేతిలో ఉన్న ఈ మైక్రోఫోన్ను మైదానంలోకి విసిరేయాలనిపిస్తోందంటూ లైవ్ కామెంటరీలో రిఘాటుగా వ్యాఖ్యానించాడు. కీలక సమయంలో ఆటగాళ్లు ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశాడు.ముఖ్యంగా మంచి ఫీల్డర్గా పేరున్న శశాంక్ సింగ్ ఫామ్ పాంటింగ్ను కలవరపెడుతోంది.
గత మూడు మ్యాచ్ల్లో శశాంక్ 5 క్యాచ్లను వదిలేయడంపై స్పందిస్తూ జట్టులో క్యాచ్ డ్రాప్ వైరస్ వ్యాపించినట్లు కనిపిస్తోందని పాంటింగ్ ఎద్దేవా చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ వంటి ప్రమాదకర బ్యాటర్ ఇచ్చిన సులువైన క్యాచ్ను శశాంక్ వదిలేయడం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. హ్యామ్స్ట్రింగ్ గాయం నుంచి కోలుకున్న తర్వాత శశాంక్ హై-క్యాచ్లను అందుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతుండటం జట్టు మనోబైర్యాన్ని దెబ్బతీస్తోందని అభిప్రాయపడ్డాడు.ఫీల్డర్ల వైఫల్యంతో బౌలర్లు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో శశాంక్ సింగ్ క్యాచ్ వదిలేయగా.. వికెట్ కీపర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ స్టంపింగ్ అవకాశాన్ని జారవిడిచాడు.
మరోవైపు లాకీ ఫెర్గూసన్ కూడా ఇషాన్ కిషన్ క్యాచ్ను నేలపాలు చేశాడు. తమ కష్టాన్ని ఫీల్డర్లు వృథా చేయడం చూసి చాహల్ మైదానంలోనే తల పట్టుకుని కూర్చుండిపోయాడు. క్రితం రోజే ఫ్లడ్లైట్ల కింద క్యాచ్ ప్రాక్టీస్ చేసినప్పటికీ.. మ్యాచ్లో ఇలాంటి తప్పిదాలు చేయడం క్షమించరానిదని పాంటింగ్ మండిపడ్డాడు.పంజాబ్ చేసిన తప్పిదాలను హైదరాబాద్ బ్యాటర్లు చక్కగా వినియోగించుకున్నారు. రెండుసార్లు లైఫ్ పొందిన ఇషాన్ కిషన్ 55 పరుగులు చేయగా.. హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో పంజాబ్ను మ్యాచ్ నుంచి దూరం చేశాడు. ఈ క్యాచ్ల పుణ్యమా అని ఎస్ఆర్హెచ్ కేవలం 17.1 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును దాటి భారీ స్కోరు సాధించింది.