KCR: నాలుగు స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు

తెలంగాణ భవన్‌లో రెండు రోజులుగా వివిధ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో కేసీఆర్‌ చర్చలు జరుపుతున్నారు. కిందిస్థాయి నేతల మద్దతు, పోటీ లేని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు.

Post Published By: narender Thiru
Updated : 4 March 2024, 6:52 PM IST

KCR: రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ వరుస పర్యటనలకు రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా తెలంగాణలోని నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని కేసీఆర్ ఖరారు చేశారు. కరీంనగర్‌ నుంచి వినోద్‌కుమార్‌, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌, మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ డీలా పడిపోయింది.

Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

కేసీఆర్ అనారోగ్యం కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది. పార్టీకి ఊపు తెచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. తగిన మైలేజీ రావడం లేదు. కీలక నేతలు పార్టీ మారుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లోకి, కేంద్రంలో ఉన్న బీజేపీలోకి చేరిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగారు. పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రెండు రోజులుగా వివిధ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో కేసీఆర్‌ చర్చలు జరుపుతున్నారు. కిందిస్థాయి నేతల మద్దతు, పోటీ లేని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. సోమవారం.. ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల నేతలతో ఇవాళ ఆయన సమావేశమయ్యారు. అయితే, ఈ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు రాకపోవడం చర్చనీయాంశమైంది.

ఇక.. దాదాపు అన్ని చోట్లా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పోటీకి నిరాకరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలవడం కష్టమనే ఆలోచనతో నేతలు పోటీ నుంచి తప్పుకొంటున్నారు. ఎక్కువమంది బీజేపీ, కాంగ్రెస్‌వైపే మొగ్గుచూపుతున్నారు. మరోవైపు.. కేసీఆర్ కరీంనగర్‌, ఖమ్మంలో సభలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఆ తర్వాత అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని కేటాయించి, అన్ని చోట్లా భారీ సభలు నిర్వహిస్తారు. కాగా.. నేతలంతా కలిసికట్టుగా పని చేసి, అభ్యర్థులను గెలిపించుకోవాలని కేసీఆర్ అన్నారు.

Published : 
  • 4 March 2024, 6:52 PM IST