ఐపీఎల్ 2026 సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. కాగా.. ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. సన్ రైజర్స్ తో మ్యాచ్లో భువీ రెండు వికెట్లు తీస్తే.. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి పేసర్గా చరిత్ర సృష్టిస్తాడు. 2011లో ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు 190 మ్యాచ్లు ఆడాడు. 27.33 సగటుతో 198 వికెట్లు పడగొట్టాడు. దీనిలో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన, మరో రెండు సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు.
ఇక ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భువీ రెండో స్థానంలో ఉన్నాడు. 221 వికెట్లు యుజ్వేంద్ర చాహల్ తొలి స్థానంలో ఉన్నాడు.పేసర్ల విషయానికి వస్తే.. భువీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతుండగా ఆ తరువాతి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. బుమ్రా 183 వికెట్లు తీశాడు. 161 వికెట్లతో డ్వేన్ బ్రావో మూడో స్థానంలో ఉన్నాడు.ఐపీఎల్ 2025 వేలంలో భువనేశ్వర్కుమార్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లతో పోటీపడి మరి కొనుగోలు చేసింది. ఆ సీజన్లో 14 ఇన్నింగ్స్ల్లో 17 వికెట్లతో ఆర్సీబీ విజయంలో భువీ కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు.
36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్కు కొత్త బంతితో అద్భుతమైన రికార్డు ఉంది. పవర్ప్లే ఓవర్లలో అతను అత్యధికంగా 79 ఐపీఎల్ వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ మాత్రమే ఈ భారత వెటరన్కు దగ్గరగా ఉన్నాడు. పవర్ప్లేలో తీసిన మొత్తం 79 వికెట్లలో 29 వికెట్లను ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే పడగొట్టడం అతని ప్రత్యేకత. ఇదిలా ఉంటే డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో ఐదు హోమ్ మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలోనూ... మరో రెండు హోమ్ మ్యాచ్లను రాయ్పూర్ అంతర్జాతీయ స్టేడియంలో ఆడనుంది.