ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా నిరాశపర్చిన టీమిండియా మరో సిరీస్కు సిద్దమైంది. పసికూన జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. గురువారం హరారే వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత టీమిండియా ఆడిన 7 మ్యాచ్ల్లో ఒక్క విజయం సాధించలేకపోయింది.పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్తో 4-0తో వైట్ వాష్ అయ్యింది. దాంతో టీమిండియా వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ను ఇంగ్లండ్కు కోల్పోయింది. నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి విజయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. మరింత యంగ్ టీమ్తో జింబాబ్వేకు చేరుకున్న అయ్యర్.. ఈ పర్యటనలోనైనా విజయాన్ని రుచి చూస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇంగ్లండ్ గడ్డపై భారీ అంచనాలతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా నిరాశపర్చాడు. వరుసగా మూడు మ్యాచ్ల్లో 14, 13, 15 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఇందులో రెండు సార్లు జోఫ్రా ఆర్చర్ బౌన్సర్ ఆడబోయి ఔటయ్యాడు. దాంతో బుడ్డోడి సామర్థ్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.ఈ పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కోల్పోయిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి జింబాబ్వే పర్యటన చక్కటి అవకాశం. ఎందుకంటే ఈ సిరీస్ నుంచి సంజూ శాంసన్కు విశ్రాంతి కల్పించారు. దాంతో వైభవ్కు పోటీనే లేకుండా పోయింది.
అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఓపెనింగ్ చేయనున్నాడు. అతను ఆకట్టుకుంటే తుది జట్టులో కొనసాగుతాడు. లేదంటే తన స్థానాన్ని ప్రభ్సిమ్రాన్ సింగ్ తన్నుకుపోతాడు.మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ ఆడనున్నారు. వైస్ కెప్టెన్ తిలక్ వర్మతో పాటు ఇషాన్ కిషన్కు ఈ సిరీస్ అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. ఐర్లాండ్తో పాటు ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన ఈ ఇద్దరూ జింబాబ్వేపై సత్తా చాటాలి. లేదంటే మరిన్ని విమర్శలు మూటగట్టుకుంటారు. శివమ్ దూబే కూడా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా నిరాశపర్చాడు. ముఖ్యంగా పేస్ బౌలింగ్ను అతను స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు. ఆ బలహీనతను అతను అధిగమించాల్సి ఉంది.
అభిషేక్ శర్మ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిలకడ చూపించాల్సి ఉంది. వరుసగా రెండు సిరీస్లు ఓడిపోవడంతో ఫినిషర్ రింకూ సింగ్కు మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఏ ఆటగాడు ఫినిషర్గా బాధ్యతను నిర్వర్తించలేకపోయారు. దాంతో రింకూ సింగ్కు మళ్లీ పిలుపు దక్కింది. ఫినిషర్గా అతను లోయరార్డర్ బాధ్యతలు మోయనున్నాడు.స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్ణోయ్ ఆడనుండగా.. స్పిన్ ఆల్రౌండర్గా హర్ష్ దూబే బరిలోకి దిగనున్నాడు. ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మలో ఇద్దరికి పేస్ విభాగంలో చోటు దక్కనుంది.