జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్స్వీప్ చేసి అదరగొట్టింది. అయితే 2028 ప్రపంచకప్ లక్ష్యంగా సాగుతున్న ఈ కీలక ప్రయాణంలో భారత జట్టు యాజమాన్యం ప్రయోగాలు చేయకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. సిరీస్ సునాయాసంగా గెలిచినా భవిష్యత్ అవసరాల దిశగా టీమిండియా కొన్ని అద్భుతమైన అవకాశాలను చేతులారా చేజార్చుకుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.ఈ పర్యటనలో అత్యంత ప్రతిభావంతుడైన ఫాస్ట్ ఆల్రౌండర్ సూర్యాన్ష్ షెడ్జ్ను పక్కన పెట్టడం పెద్ద లోపంగా కనిపిస్తోంది. కేవలం మూడో టీ20 మ్యాచ్లో మాత్రమే అతనికి అవకాశం దక్కింది. హార్దిక్ పాండ్యాకు తగిన ప్రత్యామ్నాయాన్ని వెతికే ప్రక్రియలో షెడ్జ్ లాంటి యంగ్స్టర్కు మూడు మ్యాచుల్లోనూ ఛాన్స్ ఇవ్వాల్సింది. నితీష్ కుమార్ రెడ్డి గాయాల బారిన పడుతుండటం, శివమ్ దూబే ఇంకా జట్టులో స్థానాన్ని ఖాయం చేసుకోకపోవడంతో షెడ్జ్ అత్యంత కీలకమైన ఆటగాడిగా మారే అవకాశముంది.
ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు వికెట్లు తీయడంతో పాటు ఐపీఎల్ 2026లో విలువైన పరుగులు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇండియా-ఎ తరపున కూడా శ్రీలంక-ఎ పై అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. బలహీనమైన జింబాబ్వేపై అతడికి వరుస అవకాశాలు ఇచ్చి ఉంటే అతడి బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలపై యాజమాన్యానికి స్పష్టత వచ్చేది.టీ20 క్రికెట్లో మ్యాచ్ పరిస్థితికి తగినట్లు బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడం ఎంతో ముఖ్యం. ఐసీసీ టోర్నీల్లో పరిస్థితులకు అనుగుణంగా మారే జట్లే విజయం సాధిస్తాయి. అయితే ఈ సిరీస్లో భారత్ పాత పద్ధతిలోనే సాగింది. సిరీస్ మొత్తం తీవ్రంగా నిరాశపరిచిన అభిషేక్ శర్మ స్థానంలో తిలక్ వర్మను ఓపెనర్గా పంపే ప్రయోగం చేయాల్సింది. అలాగే చాలా కాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న శివమ్ దూబేను ఆర్డర్లో ముందుకు పంపి క్రీజులో ఎక్కువ సమయం గడిపేలా చేసి ఉంటే అతడికి లయ చిక్కేది.
2028 ప్రపంచకప్ లక్ష్యంగా సాగుతున్నప్పుడు ఇలాంటి చిన్న సిరీస్లలో విభిన్న కాంబినేషన్లను పరీక్షించకపోవడం మేనేజ్మెంట్ వైఫల్యమే. మిడిలార్డర్లో రింకూ సింగ్ను కేవలం ఫినిషర్గానే కాకుండా ఇన్నింగ్స్ను నిలబెట్టే యాంకర్గా పరీక్షించేందుకు ఇది మంచి సమయం. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు కష్టాల్లో పడినప్పుడు నాలుగో స్థానంలో వచ్చి ఇన్నింగ్స్ నిర్మించిన అనుభవం అతడికి ఉంది. ఈ సిరీస్లో అతడిని మూడో స్థానంలో ప్రమోట్ చేసి ఉంటే రింకూలో ఉన్న మరో కోణం బయటపడేది. భవిష్యత్తులో టాప్ ఆర్డర్ బ్యాటర్లు గాయపడితే రింకూ లాంటి ఆటగాడు ఆ స్థానాన్ని భర్తీ చేయగలడనే నమ్మకం కుదిరేది. మరోవైపు ఎడమచేతి వాటం స్పిన్నర్ హర్ష్ దూబేకు అరంగేట్రం చేసే అవకాశం దక్కకపోవడం నిరాశ పరిచింది. ఈ సిరీస్లో భారత్కు దక్కిన ప్రధాన ప్లస్ పాయింట్ అభిషేక్ శర్మ బౌలింగ్. ఓపెనర్గా విఫలమైనప్పటికీ బంతితో రికార్డు స్థాయి ప్రదర్శన చేసి జట్టుకు అదనపు బౌలింగ్ ఆప్షన్గా మారాడు. జింబాబ్వేపై 3-0తో విజయం సాధించడం సంతోషమే అయినా, ద్వైపాక్షిక సిరీస్ల ముఖ్య ఉద్దేశం కేవలం గెలవడం మాత్రమే కాదు. బెంచ్ బలాన్ని పెంచుకోవడం, యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం చాలా అవసరమని మాజీలు అభిప్రాయపడుతున్నారు.