మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా 'పెద్ది' థియేటర్లలో ఎలా దూసుకుపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. జూన్ 4న విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. రామ్ చరణ్ కెరీర్లోనే ఇది మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అయితే, ఈ సక్సెస్ను కేవలం ఈవెంట్లు, పార్టీలకే పరిమితం చేయకుండా, 'పెద్ది' మూవీ టీమ్ ఒక మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంటోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా 'పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్' చాలా గ్రాండ్గా జరిగింది. డైరెక్టర్లు సుకుమార్, అనిల్ రావిపూడి తదితరులు ఈ వేడుకకు వచ్చారు.
ఈ భారీ సక్సెస్ సందర్భంగా సినిమా యూనిట్.. అనాథ ఆశ్రమాల్లో ఉండే చిన్నారుల కోసం ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఈ సినిమాలో చరణ్ క్రికెటర్గా, రన్నర్గా, రెజ్లర్గా నటించి ఇరగదీశాడు. ముఖ్యంగా అందులో క్రికెట్ ఎపిసోడ్స్, ఆ బ్యాట్ బాగా హైలైట్ అయ్యాయి. అందుకే సినిమాలో రామ్ చరణ్ వాడిన ఒరిజినల్ క్రికెట్ బ్యాట్ లాంటివే మరిన్ని రెప్లికాలను తయారు చేయించి.. వాటిపై స్వయంగా రామ్ చరణ్ చేత సంతకాలు చేయించి, ఆ బ్యాట్లను అనాథ పిల్లలకు బహుమతిగా ఇచ్చారు.
ఈ బ్యాట్లను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఎంతో శ్రద్ధగా డిజైన్ చేశారు. కేవలం సినిమాకే కాకుండా, పిల్లలకు కానుకగా ఇవ్వాలని యూనిట్ అడగడంతో ఆయన వాటిని ప్రత్యేకంగా తయారు చేయించారు. తమ అభిమాన హీరో రామ్ చరణ్ సంతకం ఉన్న క్రికెట్ బ్యాట్ను చేతిలోకి తీసుకోగానే ఆ చిన్నపిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వాళ్ళు ఆ బ్యాట్లతో ఆడుకుంటూ ఎంత మురిసిపోతున్నారో చూపిస్తూ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏదేమైనా.. సినిమా హిట్ అయ్యాక ఇలా అనాథ పిల్లల కళ్ళల్లో ఆనందం చూడాలని 'పెద్ది' టీమ్ చేసిన ఆలోచనను, చరణ్ తీసుకున్న చొరవను అభిమానులు, నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు. నిజమైన సక్సెస్ అంటే ఇదే అంటూ అభినందిస్తున్నారు.