CM Mamata Banerjee was humiliated at the NITI Aayog meeting in Delhi.. Mamata walked out of the meeting..
ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాబోయే కాలంలో భారత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
నీతి ఆయోగ్ నుంచి మమతా వాకౌట్..
ఈ నీతి ఆయోగ్ సమావేశానికి ఇండియా కూటమిలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక్కరే హాజరైయ్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న మిగతా అందరూ ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే.. ఇక దక్షిణాది నుంచి కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఎన్డీయే కూటమి లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఒక్కరే హాజరయ్యారు. ఈ నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుండగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. తనను మాట్లాడనివ్వకుండా, పదే పదే మైక్ మ్యూట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడేందుకు తనకు 5 నిమిషాలకు మించి అవకాశం ఇవ్వలేదంటూ కోపంగా సమావేశాన్ని వీడి వెళ్లిపోయారు. ఈ సమావేశాన్ని ఇప్పటికే ఇండియా కూటమి పార్టీలు బహిష్కరించిన సంగతి తెలిసిందే.