రోజుకు 7వేల కోట్లు ఖర్చు...40 రోజుల యుద్ధం...అమెరికా సాధించిందంటే గుండు సున్నా. నిజానికి ఇరాన్ నుంచి అమెరికాకు ఇప్పటికిప్పుడు ముప్పేమీ లేదు. అయినప్పటికీ ఏదో సాధిద్దామని డోనాల్డ్ ట్రంప్ యుద్దాన్ని షురూ చేశాడు. వారం రోజులు బాంబుల వర్షం కురిపిస్తే...ఇరాన్ దారిలోకి వస్తుందని భ్రమల్లో మునిగితేలాడు. తానొకటి తలిస్తే...దైవమొకటి తలచింది. 40 రోజుల పాటు సాగిన యుద్ధంలో ఇరాన్ తలవంచలేదు. అమెరికాకు ధీటుగా సమాధానం ఇచ్చింది. సరికొత్త వ్యూహాలతో అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రపంచానికి తెలియని అస్త్రాలతో అమెరికాకు వణికించింది. యుద్ద విమానాలను ఇరాన్ కూల్చేసింది. వార్ షిప్లను ధ్వంసం చేసింది. ఇరాన్పై యుద్ధం కోసం అమెరికా...ప్రతి రోజు 7 వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది. మొత్తంగా 2 లక్షల కోట్లపైగా ఖర్చు చేసినా...అనుకున్నది మాత్రం సాధించలేకపోయింది. సైనికులను కోల్పోకపోయినా...ఆర్థికంగా భారీగా నష్టపోయింది. చైనాకు ఇరాన్ నుంచి చమురు సరఫరాను తగ్గించటం తప్ప అమెరికా ఇందులో లాభపడేదీ ఏమీ లేదు. చివరకు అదీ గొప్పగా సాధించిందేమీ లేదు. పైగా గల్ఫ్ దేశాల్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసి... అవి తిరుగులేని భద్రత ఇస్తాయని అమెరికా మాయమాటలు చెప్పింది. ఇరాన్ క్షిపణుల దాటికి ఆ రక్షణ కవచం కుప్పకూలింది.
పైకి ఇరాన్పై ఆధిపత్యం సాధించినట్లు గంభీరాలకు పోయింది. వరుసగా ప్రకటనలిస్తూ, తలొగ్గనట్లు కనిపించినా..పంతం నెగ్గించుకున్నట్లు బిల్డప్ ఇచ్చింది. యుద్ధంలో పైచేయి సాధించినట్లుగా కనిపిస్తున్నా... ఇరాన్ ఇంటికెళ్లి ఏడ్చిన పరిస్థితి తెచ్చుకుంది. సుప్రీంనేత ఖమేనీ సహా... ముఖ్య నాయకులంతా హతమయ్యారు. సైనికదళం, పౌర సదుపాయాలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నా...అమెరికా మాత్రం పట్టు సాధించలేకపోయింది. యుద్దానికి ముందు వర్గాలుగా విడిపోయిన ఇరాన్ ప్రజలు...అమెరికా దాడులతో ఒక్కటయ్యారు. 40 రోజుల పాటు జరిగిన యుద్ధంలో...అమెరికాకు ఇరాన్ కొరకరాని కొయ్యలా మారింది. టెహ్రాన్ను దారిలోకి తెచ్చుకొని...కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేద్ధామనుకున్న ట్రంప్ ఆశలు ఆడియాసలు అయ్యాయి. ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాడు. హర్మూజ్ మీదుగా పడవలు రాకపోకలు సాగకుండా...దిగ్బంధిస్తామని హెచ్చరించాడు. అయితే హర్మూజ్ జలసంధిని దిగ్బంధించడం అంత ఈజీనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే యుద్ధంలో దెబ్బతిన్న అమెరికా...అన్నంత పని చేస్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. హర్మూజ్పై ఇరాన్ సైన్యానికి, నేవీ అధికారులకు పూర్తిగా అవగాహన ఉంది. అలాంటి చోట అమెరికా పప్పులు ఊడుకుతాయా అంటే నెవ్వర్ పాజిబుల్ అంటున్నారు నిపుణులు.
వాషింగ్టన్తో ఒప్పందం షరతులకు లోబడి హర్మూజ్ను తెరిచిన టెహ్రాన్.. లెబనాన్లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. కాల్పుల విరమణకు అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ అంగీకరించలేదు. తమ డిమాండ్లు నెరవేరినప్పుడు, తాము నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే యుద్ధం ముగుస్తుందని కుండబద్దలు కొట్టింది. అప్పటివరకు శత్రు దేశాలపై భారీ స్థాయిలో దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సాధిస్తోంది. ఒక్కో నౌకపై సుమారు 2 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.18 కోట్ల వరకు పన్ను విధించింది. హర్మూజ్ జలసంధి గుండా శత్రు దేశాల నౌకలను అనుమతించట్లేదు. అయితే ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఈ జలసంధిలో ఒక టోల్ బూత్ విధానాన్ని అమలు చేస్తోంది. హర్మూజ్ గుండా ప్రయాణించే నౌకలు పూర్తి పత్రాలను సమర్పించాలని సూచించింది. అంతేకాకుండా షిప్లకు క్లియరెన్స్ కోడ్లను పొంది, ఐఆర్జీసీ పర్యవేక్షణలో ఒకే నియంత్రిత కారిడార్ గుండా ప్రయాణించడానికి అంగీకరించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఐఆర్జీసీ టోల్ బూత్ విధానం కింద ముందుగా ఆమోదించిన మార్గంలో ఈ నౌకలు వెళ్తున్నాయి. యుద్దానికి ముందు వరకు ఎలాంటి ఇరాన్ ఎలాంటి టోల్ వసూలు చేయలేదు. ట్రంప్ తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఇరాన్...నౌకలపై టోల్ వసూలు చేస్తోంది.