14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అభిషేక్ శర్మ రికార్డుల ఊచకోత

గువాహటి వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌కు రికార్డులు బద్దలయ్యాయి

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 26, 2026 | 11:58 AMLast Updated on: Jan 26, 2026 | 8:07 PM

Abhishek Sharma Sets A Record With A Half Century In Just 14 Balls

గువాహటి వేదికగా భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌కు రికార్డులు బద్దలయ్యాయి. 154 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్లను అభిషేక్ ఊచకోత కోశాడు. మొదటి బంతినుంచే దూకుడు చూపించిన అభిషేక్, జేకబ్ డఫీ వేసిన తొలి ఓవర్‌లోనే ముందుకు వచ్చి ఆడుతూ తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసే అవకాశం ఇవ్వకుండా వరుస బౌండరీలు, భారీ సిక్సులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 14 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త రికార్డుల సరసన తన పేరును నమోదు చేసుకున్నాడు.

ఈ అర్ధసెంచరీతో అభిషేక్ శర్మ , ఫుల్ మెంబర్ జట్టుపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అయితే, 2007లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన యువరాజ్ సింగ్ రికార్డు మాత్రం అలాగే నిలిచిపోయింది. అభిషేక్‌కు యువరాజ్ మెంటార్‌గా ఉన్న నేపథ్యంలో, ఈ ఇన్నింగ్స్‌కు మరింత ప్రాధాన్యం దక్కింది. టీ20 అంతర్జాతీయాల్లో 25 బంతుల్లోపు అర్ధసెంచరీ చేసిన సందర్భాల్లో అభిషేక్ తొమ్మిది సార్లు ఈ ఘనత సాధించాడు. ఈ విషయంలో సూర్యకుమార్ యాదవ్‌ను కూడా వెనక్కి నెట్టి టాప్‌లో నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు. జాక్ ఫ్రిలింక్ 13 బంతుల్లో, కాలిన్ మున్రో 14 బంతుల్లో, అభిషేక్ శర్మ 14 బంతులు, క్వింటన్ డికాక్ 15 బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశారు. అదేవిధంగా 25 బంతుల్లోపు ఎక్కువసార్లు హాఫ్ సెంచరీ చేసిన లిస్ట్‌లో అభిషేక్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. తొమ్మిది సార్లు అభిషేక్ శర్మ 25 బంతుల్లోపు ఫిఫ్టీ బాదగా.. సూర్యకుమార్ యాదవ్ 25, ఫిల్ సాల్ట్ 7, ఎవిన్ లుయీస్ 7 సార్లు నమోదు చేసాడు.అభిషేక్ 20 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలవగా, మరోవైపు సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అభిషేక్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు భారీ సిక్సులు ఉండగా, భారత్ 10 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 3-0తో అజేయ ఆధిక్యం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది.