కెప్టెన్లలో శ్రేయాస్ తోపు…అసలైన నాయకుడంటూ ప్రశంసలు…!

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ జట్టు ఫేట్‌ మారిపోయింది. గత సీజన్‌లో పగ్గాలు చేపట్టిన అతను.. తొలి ప్రయత్నంలోనే పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. దురదృషవశాత్తు ఫైనల్లో ఓడింది కానీ, టైటిల్‌కు పూర్తిగా అర్హమైన జట్టు

Post Published By: dialnews
Updated : 21 April 2026, 10:50 AM IST

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ జట్టు ఫేట్‌ మారిపోయింది. గత సీజన్‌లో పగ్గాలు చేపట్టిన అతను.. తొలి ప్రయత్నంలోనే పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. దురదృషవశాత్తు ఫైనల్లో ఓడింది కానీ, టైటిల్‌కు పూర్తిగా అర్హమైన జట్టు అని అందరిచే ప్రశంసలందుకుంది. గత సీజన్‌లో తృటిలో చేజారిన టైటిల్‌ను పంజాబ్‌ ఈ సీజన్‌లో ఎలాగైనా సాధించాలని పట్టుదలగా ఉంది. మరోసారి శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో తమ తొలి టైటిల్‌ దిశగా దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టకలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టు ఏదైనా ఉందా అంటే అది పంజాబ్‌ మాత్రమే. తాజాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు భారీ విజయాన్ని సాధించింది.

తొలుత బ్యాటింగ్‌లో 254 పరుగులు చేసి, ఆతర్వాత ఆ స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ చేసిన స్కోర్‌ సీజన్‌లోనే అత్యధికం. వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్‌ విజయ రహస్యం ఏంటా అని పరిశీలిస్తే, అది వారి కెప్టెనేనని తెలుస్తుంది.శ్రేయస్‌ ఈ సీజన్‌లో మునుపెన్నడూ లేనంత పట్టుదలగా ఉన్నాడు. కెప్టెన్‌గా ఎంతో పరిణితి ప్రదర్శిస్తూ జట్టు విజయాలకు ప్రధాన కారకుడిగా నిలుస్తున్నాడు. శ్రేయస్‌ కెప్టెన్సీ శైలి ఇతర నాయకులతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా, వారికి స్వేచ్ఛ ఇచ్చి ఆడేలా చేయడం అతని ప్రత్యేకత. ప్రతి ఆటగాడి వ్యక్తిగత శైలి, రొటీన్‌ను గౌరవించడం ద్వారా జట్టులో విశ్వాసాన్ని పెంచాడు. ఈ విధానం కారణంగా బ్యాటర్లు నిర్భయంగా ఆడుతూ, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని పెంచగలుగుతున్నారు. పంజాబ్ విజయాల్లో బ్యాటింగ్ విభాగం వారి ప్రధాన బలం. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ వరకు దూకుడైన ఆట కనిపిస్తోంది.

ముఖ్యంగా సిక్సర్లు కొట్టడంపై ఆ జట్టు ప్రత్యేక దృష్టి పెట్టింది. శ్రేయస్‌ ఆటగాళ్ల మధ్య సిక్సర్ల పోటీ పెట్టి, జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. ఇది కేవలం వినోదాత్మక అంశంగా కాకుండా, మ్యాచ్‌లలో స్కోరింగ్ రేట్ పెంచడానికి దోహదపడుతోంది. ఫలితంగా, పంజాబ్ జట్టు భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతోంది. బౌలింగ్ విభాగంలోనూ పంజాబ్ సమతుల్యంగా ఉంది. అంతర్జాతీయ స్థాయి అనుభవం కలిగిన బౌలర్లు జట్టుకు బలం చేకూరుస్తున్నారు. మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి ఆటగాళ్లపై ప్రత్యేక వ్యూహాలు రూపొందించి, వాటిని కచ్చితంగా అమలు చేయడంలో బౌలర్లు విజయవంతమవుతున్నారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకోవడం పంజాబ్ ప్రత్యేకతగా మారింది. ఫీల్డింగ్‌లో కూడా జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. శ్రేయస్‌ కేవలం కెప్టెన్‌గానే కాకుండా, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో సత్తా చాటుతూ తన సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు ప్రదర్శించిన జోరును ఇకపై కూడా కొనసాగిస్తే, పంజాబ్‌ తమ తొలి టైటిల్‌ సొంతం చేసుకోవడం ఖాయం.

Published : 
  • 21 April 2026, 10:50 AM IST