ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఆకాశ్ దీప్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. గాయం నుంచి అతడు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసంలో ఉన్నాడు. దురదృష్టవశాత్తు.. ఆకాశ్ దీప్ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడని ఓ కేకేఆర్ అధికారి వెల్లడించినట్లు క్రిక్బజ్ తెలిపింది. 29 ఏళ్ల ఈ బెంగాల్ పేసర్ను కేకేఆర్ జట్టు వేలంలో కోటి రూపాయలకు దక్కించుకుంది.
ఆకాష్ దీప్ తరచుగా గాయాల బారిన పడుతున్నాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియాతో పాటు ఐపీఎల్లో ఫ్రాంఛైజీ తరుపున పలు మ్యాచ్లకు దూరం అయ్యాడు. 2022లో ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన ఆకాశ్.. నాలుగు సీజన్లలో కేవలం 14 మ్యాచ్లే ఆడాడు. 10 వికెట్లు తీశాడు. గత సీజన్లో అతడు లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడాడు. వేలంలో అతడిని 8 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 సీజన్లో అతడు 6 మ్యాచ్ల్లో 3 వికెట్లే తీశాడు. దీంతో సీజన్ పూర్తి కాగానే లక్నో అతడిని విడిచిపెట్టింది.ఐపీఎల్ 2026 ముందు కేకేఆర్కు పేసర్ల గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. గాయం కారణంగా శిబిరం ప్రారంభానికి ముందే ఈ సీజన్ నుంచి భారత పేసర్ హర్షిత్ రాణా తప్పుకున్నాడు.
అతడి స్థానంలో ఎవరినైనా తీసుకోవాలా? వద్దా అన్న సందిగ్ధంలో కేకేఆర్ ఉంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన శ్రీలంక పేసర్ మతీషా పతిరానా ను వేలంలో 18 కోట్లకు కేకేఆర్ తీసుకుంది. అయితే.. అతడు గాయం నుంచి కోలుకున్నప్పటికి కూడా పూర్తి ఫిట్నెస్ సాధించాడో లేదో తెలియని పరిస్థితి ఉంది. అతడు శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్ఓసీ ని పొందాల్సి ఉంది. ఈ క్రమంలో అతడు ఎప్పుడు జట్టుతో చేరతాడో తెలియని పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు ఆకాశ్ దీప్ దూరం కావడంతో కేకేఆర్ పేస్ బౌలింగ్ బలహీనంగా మారింది.కేకేఆర్ జట్టులో ప్రస్తుతం వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ త్యాగి లు మాత్రమే భారత పేసర్లు. ఇక ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్తో కొన్ని ఓవర్లు వేయించే అవకాశం కూడా కేకేఆర్కు ఉంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్ మార్చి 29న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో ఆడనుంది.